ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్నుకు సంబంధించి పూర్తి చేయాల్సిన కొన్ని పనులుంటాయి. ఆ పనులేవీ.. వాటిని పూర్తి చేశారా? పరిశీలించుకోండి
ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయానికి ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో లెక్కలు వేసుకోవాలి. సెక్షన్ 80సీ కింద వర్తించే మినహాయింపులన్నీ వాడుకున్నారా? లేదా? చూసుకోండి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, జాతీయ పింఛను పథకం, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్ఎస్ఎస్ ఇలా అనేక పథకాల్లో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా సెక్షన్ 80సీ పరిమితి రూ.1,50,000 పూర్తి కాకపోతే.. అనుకూలమైన పెట్టుబడి పథకాన్ని ఎంచుకోండి.
ఇప్పటికే తీసుకున్న పీపీఎఫ్, ఎన్పీఎస్, ఎస్ఎస్వై పథకాల్లో.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకసారైనా మదుపు చేయకపోతే.. మార్చి 31లోపు తప్పనిసరిగా కనీస మొత్తమైనా పెట్టుబడి పెట్టాలి.
ఆధార్తో పాన్ను అనుసంధానం చేసేందుకు ఈ నెలాఖరు వరకూ గడువుంది. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయండి. గడువు దాటితే పాన్ చెల్లకుండా పోయే ఆస్కారం ఉంది. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం కష్టమవుతుంది.
మీ బ్యాంకు ఖాతాలో మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలను పూర్తి చేయండి. పాన్, ఆధార్, చిరునామా ధ్రువీకరణలాంటి వాటితోపాటు బ్యాంకు అడిగిన ఇతర వివరాలనూ మార్చి 31లోపు అందించాలి.
‘వివాద్ సే విశ్వాస్’ పథకంలో భాగంగా ఏదైనా పన్ను బాకీ ఉంటే.. దానిని చెల్లించేందుకు మార్చి 31 వరకూ వ్యవధినిచ్చింది ఆదాయపు పన్ను విభాగం. ఇలా చెల్లించినప్పుడు వడ్డీతోపాటు, అపరాధ రుసుములనూ రద్దు చేస్తామని పేర్కొంది.