జీవిత బీమాలో ఈ మార్పులు తెలుసా?
జీవిత బీమా పాలసీలను మరింత ఆకర్షణీయంగా మార్చడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పలు నిబంధనల్లో మార్పులు చేసింది.
పాలసీదారు కోరుకుంటే, జీవిత బీమా పొదుపు పాలసీలపై బీమా సంస్థలు తప్పనిసరిగా రుణం ఇవ్వాల్సి ఉంటుంది.
పాలసీ నచ్చకపోతే, దాన్ని వాపసు ఇచ్చే వెసులుబాటు గడువును 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచింది.
అన్ని వయసుల వారు, ప్రాంతాల వారు, దివ్యాంగులు ఎంచుకునేలా పాలసీలు ఉండాలి. పాలసీదారుడు తన అవసరం మేరకు రైడర్లను ఎంచుకునే అవకాశం కల్పించాలి.
పాలసీదారులకు పూర్తి సమాచారం అందించే ‘కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్’లో పాలసీ రకం, పాలసీ మొత్తం, అందించే ప్రయోజనాలు, మినహాయింపులు, క్లెయిం విధివిధానాలు అన్నీ ఉండాలి.
పాలసీ వ్యవధి తీరిన తర్వాత చెల్లించే మొత్తం, పాలసీదారు మరణించినప్పుడు ఇచ్చే పరిహారం వివరాలు స్పష్టంగా పేర్కొనాలి.
పాలసీ పునరుద్ధరణ సమయంలో గడువులోపు ప్రీమియం చెల్లించకపోతే.. మరో 30 రోజుల అదనపు వ్యవధిని ఇవ్వాలి.
పింఛను పాలసీలు తీసుకున్న పాలసీదారులకు, పిల్లల ఉన్నత విద్య, వివాహం, ఇంటి కొనుగోలు, వైద్య ఖర్చులు వంటి సందర్భాల్లో పాక్షికంగా కొంత మొత్తం ఉపసంహరించుకునేందుకు అనుమతించాలి.
బీమా అంబుడ్స్మన్ ఇచ్చిన అవార్డుపై బీమా సంస్థ అప్పీలుకు వెళ్లకపోతే.. 30 రోజుల్లోగా దాన్ని అమలు చేయాలి. ఒకవేళ ఈ గడువు దాటితే ఫిర్యాదుదారులకు రోజుకు రూ.5,000 చొప్పున చెల్లించాలి.