మరో ‘బిగిల్’ బ్యూటీ.. టాలీవుడ్ ఎంట్రీ
విజయ్ హీరోగా తెరకెక్కిన ‘బిగిల్’లో క్రీడాకారిణులుగా నటించిన అమృత అయ్యర్, వర్ష బొల్లమ్మ, రెబా మోనికా జాన్ ఇప్పటికే టాలీవుడ్లో అడుగుపెట్టి అలరించారు. ఇప్పుడదే బాటలో మరో బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఆమే.. ఇందూజ రవిచంద్రన్.
హీరో రవితేజ- డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో నాలుగో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఖరారుకాని ఈ చిత్రంతోనే ఈ చెన్నై చంద్రం టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది.
వినూత్న కథతో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.
ఇంజినీరింగ్ చదివే సమయంలోనే మోడలింగ్ రంగంలోకి వెళ్లింది.
నటనపై ఆసక్తి ఉండడంతో తాను చదివిన, ఇతర కాలేజీల్లో నిర్వహించిన పలు వేడుకల్లో ప్రదర్శనలిచ్చింది.
చిత్ర పరిశ్రమలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా ఇందూజ ఇచ్చిన ఓ ఆడిషన్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు దృష్టిని ఆకర్షించింది.
తాను సమర్పకుడిగా వ్యవహరించిన ‘మేయాధ మాన్’ (2017)లో ఇందూజకు నటిగా అవకాశం ఇచ్చారు సుబ్బరాజు. హీరో వైభవ్కు చెల్లిగా నటించింది.
ఈమె నటించిన రెండో చిత్రం ‘మెర్క్యురీ’.. సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందింది. తర్వాత పలు సినిమాలు చేసినా 2019లో వచ్చిన ‘మగముని’, ‘బిగిల్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘తిరవన్’ వెబ్సిరీస్లోనూ నటించింది.
గతంలో ఓ పాత్ర విషయంలో తనపై ట్రోల్స్రాగా.. వాటిని సీరియస్గా తీసుకోనని, ఓ విధంగా అది సినిమా ప్రచారానికి ఉపయోగపడుతుందని చెప్పింది.