‘మెగాస్టార్’.. ఇప్పుడు పద్మవిభూషణ్
సుప్రీంహీరో, మెగాస్టార్, పద్మ భూషణ్ చిరంజీవి ఇప్పుడు పద్మ విభూషణ్కు ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ‘చిరు’ గురించి కొన్ని విశేషాలు..
‘పునాది రాళ్లు’తో నటుడిగా తొలి అవకాశం అందుకున్నా.. రెండో సినిమా ‘ప్రాణం ఖరీదు’ (1978) ముందు విడుదలైంది.
ఈ ‘సుప్రీమ్ హీరో’కు ‘మెగాస్టార్’ బిరుదునిచ్చింది ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు. ‘మరణ మృదంగం’ (1988)తో అది ప్రారంభమైంది.
ఒకే హీరోకి రెండు బిరుదులు ఉండటం, ఆ రెండింటిపై పాటలు (సుప్రీమ్ హీరో, స్టార్ స్టార్ మెగాస్టార్) రూపొందడం అరుదు (యముడికి మొగుడు, కొదమసింహం).
తమిళం, కన్నడ, హిందీలోనూ నటించిన చిరంజీవి హీరోగా ఓ హాలీవుడ్ మూవీ(అబు: బాగ్దాద్ గజదొంగ) ఖరారైనా, అది కార్యరూపం దాల్చలేదు.
‘హనుమాన్’ (2005)లో యానిమేటెడ్ పాత్రకు గాత్రదానం చేశారు. ‘రుద్రమదేవి’, ‘ఘూజీ’, ‘బ్రహ్మాస్త్ర’, ‘రంగమార్తాండ’, ‘పొన్నియిన్ సెల్వన్’ తదితర చిత్రాలకు నెరేటర్గా వ్యవహరించి, మంచి ప్రభావం చూపారు.
రష్యన్లోకి డబ్ అయిన తొలి దక్షిణాది చిత్రం.. చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’. ఈ సినిమాతో బ్రేక్ డ్యాన్స్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
రూ. 10 కోట్లకుపైగా కలెక్షన్స్ (షేర్) సాధించిన తొలి తెలుగు చిత్రంగా ‘ఘరానా మొగుడు’, అత్యధిక గ్రాస్ వసూళ్లు చేసిన తొలి తెలుగు సినిమా ‘ఇంద్ర’ చరిత్ర సృష్టించాయి.
అభిమానులను అలరించేందుకు ‘బావగారూ బాగున్నారా’ చిత్రంలో బంగీజంప్ చేశారు (240 అడుగుల ఎత్తు నుంచి దూకారు).
1980, 1983లో 14 చిత్రాలు విడుదలవడం ‘చిరు’ అంకితభావానికి నిదర్శనం...
అత్యధిక పారితోషికం (రూ.1.25 కోట్లకుపైగా) అందుకున్న తొలి భారతీయ నటుడు (1992లో).
ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్బాబు, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్వంటి దిగ్గజాలతో కలిసి నటించడం విశేషం.
‘రాజు’ పేరుతో ఎక్కువ సినిమాల్లో నటించారు (మృగరాజు, బావగారూ బాగున్నారా, రిక్షావోడు,ఘరానా మొగుడు, ఆరాధన, జగదేక వీరుడు అతిలోక సుందరి, మగధీరుడు, జ్వాల, మగమహారాజు, పల్లెటూరి మొనగాడు).
చిరంజీవితో అత్యధిక చిత్రాలు (దాదాపు 25) తెరకెక్కించిన దర్శకుడు కోదండ రామిరెడ్డి.
ఈ హీరో సరసన ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు.. రాధిక (సుమారు 20), విజయశాంతి (17), రాధ (దాదాపు 16), సుహాసిని (9).