చిత్రం చెప్పే విశేషాలు
(26-05-2023/2)
తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పట్టాల పంపిణీకి నేడు సీఎం జగన్ రానున్న నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు.
ఫ్రాన్స్లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలిబ్రిటీస్ రెడ్ కార్పెట్పై మెరిసిపోతున్నారు. నటి అదితిరావు హైదరీ పసువు వర్ణంతో ఉన్న పొడవైన గౌనులో చూపరులను ఆకట్టుకుంది.
ఎంపీ అవినాష్రెడ్డి నేడు హైదరాబాద్ బయల్దేరారు. తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడిన నేపథ్యంలో కర్నూలు నుంచి ఆయన హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున అవినాష్ అనుచరులు విశ్వభారతి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీని దిల్లీలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ రాజకీయ అంశాలపై వారు చర్చించారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ.. ఆ జట్టు సభ్యుడు పతిరాన కుటుంబాన్ని చెన్నైలో కలిశారు. ఈ సందర్భంగా ధోనీ.. ‘మీరు పతిరాన గురించి చింతించవద్దు. ఆయన ఎప్పుడూ నాతోనే ఉంటాడు’ అని వారికి భరోసా ఇచ్చారు.
అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మిత్ర్ క్లినిక్ను సందర్శించారు. ఇందులో అన్నిరకాల వైద్య సేవలను ట్రాన్స్జెండర్లే అందిస్తుంటారు.
క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్ పర్యటనకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన ఇన్స్టా ఖాతాలో పంచుకున్నారు. లండన్ మార్నింగ్స్ అని పోస్టు పెట్టారు.
తుర్కియేలో ఫిబ్రవరిలో తీవ్ర భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఇళ్లు కోల్పోయిన బాధితులు అక్కడి కహ్రమన్మరస్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
మహేశ్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’(వర్కింగ్ టైటిల్). సినిమా టైటిల్ను ఈ నెల 31న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లోని మహాశక్తి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.