చిత్రం చెప్పే విశేషాలు..!
(10-06-2023/1)
శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో కథానాయకుడు శర్వానంద్, రక్షితల వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
దాదాపు 115 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్లోని పాతబస్తీ ముస్లింజంగ్పూల్ వంతెనపై మొక్కలు మొలిచి చెట్లుగా మారుతున్నాయి. దీంతో వంతెనకు బీటలు వారుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.
మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర పెద్దచెరువులో చేపలు సమృద్ధిగా లభిస్తుండడంతో వందల సంఖ్యలో పెయింటెడ్ స్టార్క్ పక్షులు గుంపులుగా వలస వస్తున్నాయి. ప్రస్తుతం చెరువు చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఈ పక్షులే కనిపిస్తున్నాయి.
మండుటెండలో ఆకలితో వచ్చిన ఓ కోతి కొబ్బరి బొండాలను వెతికింది. నీళ్లు తాగి పడేసిన వాటిలో ఓ బొండాను పట్టుకుని అందులోని కొబ్బరిని నోట్లో వేసుకుంటూ చల్లగా ఆరగించింది. ఖమ్మం జిల్లాలోని తల్లాడ రింగురోడ్డు కూడలిలో ఓ దుకాణం వద్ద ఈ దృశ్యాన్ని ‘న్యూస్టుడే’ శుక్రవారం క్లిక్ మనిపించింది.
చల్లని వాతావరణంలో చక్కర్లు కొట్టే సీతాకోకచిలుకలకు వేడిమి అనుకూలించడం లేదు.. పంటపొలాలు, పచ్చటి గడ్డి, పుష్పాల వద్ద సంచరించే ఇవి వాగులు, సెలయేర్ల సమీపంలోనే ఉంటున్నాయి. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం దొరవారివేంపల్లి గ్రామ సమీప వాగులో నీటి వద్ద కనిపించాయి.
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని ఈ మధ్యనే నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చారు. దీనికి ఇరు వైపులా గోడలపై నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో దేశ నాయకుల చిత్రాలను ఖమ్మం నుంచి వచ్చిన కళాకారులతో పెయింటింగ్ వేయిస్తున్నారు.
హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ‘‘హైదరాబాద్ జ్యువెలరీ, పెరల్, జెమ్ ఫెయిర్’’(హెచ్జేఎఫ్) పేరిట ఏర్పాటు చేసిన ఆభరణాల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో మోడళ్లు హొయలు పోయారు.
హైదరాబాద్ నగర సుందరీకరణలో భాగంగా ఇటీవల నెక్లెస్ రోడ్డులో రాతి జింకలు ఏర్పాటు చేశారు. ఇవి పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. చిన్న పిల్లల్ని వాటిపై కూర్చోబెట్టి ఫొటోలు దిగుతూ సందడిగా గడుపుతున్నారు.
హూలా ప్రెస్టన్ పట్టణాన్ని నీరు చుట్టుముట్టడంతో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ.