చిత్రం చెప్పే విశేషాలు
(15-09-2023/1)
పోలండ్లోని మికొలో నగరంలో డిక్టేడర్స్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో కంపెనీఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ప్రపంచ కృత్రిమ మేధ తొలి సీఈవో మికా పాల్గొన్నారు.
రెక్కలపైనే కనురెప్పలు పెట్టుకున్నట్లుగా ఉన్న ఈ సీతాకోకచిలుకను చూస్తుంటే ముద్దొస్తోంది కదూ. నక్కపల్లిలో ఓ ఇంటి వద్ద కనిపించిన దీన్ని పలువురు ఆసక్తిగా చూశారు.
గురువారం సాయంత్రం హైటెక్సిటీలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కార్యాలయాల్లో పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు అవస్థపడ్డారు. శిల్పారామం ఎదురుగా ఉన్న ఛెత్రి కిందకి పలువురు ఇలా చేరి వర్షం తగ్గాక వెళ్లిపోయారు.
శ్రావణ మాసం పొలాల అమావాస్య సందర్భంగా బుధవారం సనత్నగర్ హనుమాన్ దేవస్థానం ఆవరణలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు చేశారు. స్వామిని బిల్వ దళాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.
కోఠి ఉమెన్స్ కళాశాల బస్టాప్ నుంచి రోజూ ఉదయం సికింద్రాబాద్ వెళ్లే బస్సుల కోసం విద్యార్థులు ఫీట్లు చేస్తున్నారు. ఫుట్బోర్డుపై ప్రమాదకరంగా వెళ్తున్నారు. కాలు జారితే ప్రాణాలు కోల్పోవడం ఖాయం. ఉదయం వేళలో కళాశాలల సమయానికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పుడు వచ్చినా ఇప్పటి వరకు వి.టి.జి.వై-1(మోడల్ నంబర్) రకం హెలికాప్టర్లోనే ఖమ్మం వచ్చేవారు. గురువారం ఖమ్మం స్టేడియంలో మంత్రులు వి.టి.ఆర్ఆర్.సి.(మోడల్ నంబర్) హెలికాప్టర్లో దిగారు. గతంలో వచ్చిన వాటికన్నా ఇది చాలా కొత్తగా, ఆకర్షణీయంగా ఉంది.
వినాయకచవితి సందర్భంగా నరసరావుపేట పల్నాడు రోడ్డులోని రెడ్డినగర్లో గణనాథుని ప్రతిమలు సిద్ధం చేశారు. వివిధ రూపాలతో ఆకర్షనీయ రంగులతో వీటిని తయారు చేశారు. ఇవి ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
కేరళ రాష్ట్ర టూరిజం ప్రచారంలో భాగంగా విశాఖ బీచ్రోడ్డులోని ఓ హోటల్లో గురువారం ఉదయం కేరళ సంప్రదాయ నృత్యాలను కళాకారులు ప్రదర్శించారు.
పొలాల అమావాస్యను పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం బసవన్నల పండగను ఉత్సాహంగా నిర్వహించారు. తాంసిలో రైతులు తమ ఎద్దులను అలంకరించి హనుమాన్ ఆలయం చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేయించారు.
జిల్లా వ్యాప్తంగా హిందీ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. రణస్థలం మండలంలోని కొండములగాం ఆదర్శ పాఠశాలలో హిందీ దివస్ అక్షర నమూనాలో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆ చిత్రమే ఇది.
ఆదిలాబాద్ పట్టణంలో కొందరు ట్రాక్టర్లలో బెల్లం ముద్దల్లా కనిపిస్తున్న నిల్వలను విక్రయించడంతో స్థానికులు ఇదేమిటని ఆశ్చర్యపోయారు. తీరా దగ్గరికి వెళ్లాకా రుచి చూస్తే అది నల్ల ఉప్పు అని తెలిసింది. ఆయుర్వేదంలో సేంద్రీయ లవణానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది.
స్వాతంత్య్ర సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్నా సరిహద్దు ఛత్తీస్గఢ్లో చివరి మజిలీలో చావుతిప్పలు తప్పడం లేదు. సరిహద్దు రాష్ట్రంలోని సరంగఢ్ జిల్లా పరిధిలో గురువారం చోటు చేసుకున్న ఈ పరిణామం సరిహద్దులో దుస్థితిని తేటతెల్లం చేస్తోంది.