చిత్రం చెప్పే విశేషాలు
(18-09-2023/1)
ఈ జగత్తు రూపకల్పన, నిర్మాణం చేసిన దేవశిల్పి విశ్వకర్మ జన్మదినం, ప్రధాని నరేంద్రమోదీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పూరీ తీరంలో ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం తీర్చిదిద్ది శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం తండాకు చెందిన బానోతు సరిచంద్ అనే యువకుడు వినాయక చవితి నేపథ్యంలో సూక్ష్మ రూపాల్లో గణనాథులను రూపొందించారు. రావిచెట్టు ఆకు, సుద్దముక్క, కంది, బియ్యం, నువ్వుల గింజలు, పెన్సిల్ మొనపై వినాయకుడిని చిత్రీకరించారు.
కాంత్రివీర సంగోళ్లి రాయణ్ణ సిటీ రైల్వేస్టేషన్ ఆవరణలో ప్రయాణికులు వినియోగించిన 18 కిలోల ప్లాస్టిక్ సీసాతో భూగోళం రైల్వే ఉద్యోగులు నిర్మించారు.
ఆసియా క్రికెట్ ఫైనల్ పోరు ఆదివారం సాయంత్రం కొలొంబో(శ్రీలంక)లో జరిగింది. టీమిండియా ప్రత్యర్థి శ్రీలంకపై అద్వితీయ విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చిదిద్ది శుభాకాంక్షలు తెలిపారు.
నగరంలో ఎంఐఎం ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కారుకు మువ్వన్నెల రంగుల పూలతో అలంకరించారు.
దంతాలపల్లి మండలం రేపోణి మీదుగా లక్ష్మీపురం వెళ్లే ఎస్సారెస్పీ ఉప కాలువలో ఆదివారం భారీ చేప లభ్యమైంది. వాలుగ రకానికి చెందిన ఈ చేప ఎనిమిది కిలోల బరువు ఉంది. భారీ చేప చిక్కడంతో గ్రామస్థులు దీనితో సెల్ఫీలు దిగారు.
శ్రీకాకుళం నగరం అరసవల్లికి చెందిన సూక్ష్మ కళాకారుడు వాడాడ రాహుల్ పట్నాయక్ నెమలి పింఛంపై వినాయకుడి చిత్రాన్ని గీశారు. దీని కోసం రెండు గంటలపాటు శ్రమించినట్లు రాహుల్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఈ చిత్రాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు.
వినాయక చవితి వేడుకలకు ఊరూవాడా ముస్తాబైంది. ఇప్పటికే పందిళ్లను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో వాటిని అలంకరించారు. గణనాథులను మండపాలకు తరలిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరుకు చెందిన ఫొటోగ్రాఫర్ సాదుల నరేందర్ వినూత్నంగా నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రైమ్ మినిస్టర్ (పీఎం) అక్షరాలను, వయసు 73 సంఖ్యను కెమెరాలు, వాటి పరికరాలతో అమర్చి కుటుంబ సభ్యులతో కలిసి అభిమానాన్ని చాటుకున్నారు.
కోఠి బడిచౌడి, గుడిమల్కాపూర్ మార్కెట్లలో పూజ సామగ్రి, వినాయకుల ప్రతిమల కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది. ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు అవస్థలు పడ్డారు.
ఈ చిత్రాన్ని చూస్తే గంగమ్మ దివి నుంచి భువికి వచ్చిందా అనిపిస్తోంది కదూ. కాని ఇది పిట్లం మండలం బ్రాహ్మణపల్లి గేటు వద్ద మిషన్ భగీరథ పైపులైను లీకేజీ కారణంగా ఏర్పడిన దుస్థితి. నీటి ఒత్తిడి అధికంగా ఉండటంతో ఫౌంటెయిన్లా నీరంతా నింగికెగిసింది. వేలలీటర్ల జలం నేలపాలైంది.
పంజాబ్లోని లుథియానాలో శునకాల కోసం ప్రత్యేక పార్కును ఏర్పాటు చేశారు. శునకాలను పెంచుకుంటున్నవారు తమ బుజ్జికుక్కలను ఎంచక్కా ఇక్కడకు వాహ్యాళికి తీసుకురావొచ్చు.
బ్రెజిల్లోని అమెజానాస్ రాష్ట్రం బార్సెలోస్లో శనివారం కుప్పకూలిన విమానం శకలాలను పరిశీలిస్తున్న స్థానికులు. ఈ దుర్ఘటనలో 14 మంది మృతిచెందారు.
లంబోదరుడు ఈ తొమ్మిది రోజులు భక్తుల నుంచి పూజలు అందుకోనున్నాడు.. ఆదిలాబాద్లోని కుమార్ జనతా గణేష్ మండలం 50వ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంలో 48 అడుగుల ఎత్తు మహా గణపతి ప్రతిమను ప్రతిష్ఠించనున్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ శివారులో గంగయ్య, మల్లేశం అనే ఇద్దరు రైతులు మూడెకరాల్లో నాలుగేళ్ల క్రితం మామిడి తోట వేశారు. అప్పటి నుంచి యాసంగి, వానాకాలం రెండు సీజన్లలోనూ అంతరపంటగా వరి సాగు చేస్తున్నారు. మామిడి మొక్కలు చిన్నగా ఉండడంతో ధాన్యం పండుతోందని తెలిపారు.