చిత్రం చెప్పే విశేషాలు
(30-09-2023/1)
వయసు భేదం లేకుండా గుండె జబ్బులతో చనిపోతున్నారని, ఇప్పటికైనా ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సూచించారు. పూరీ తీరంలో ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని ఓ సైకత శిల్పం ప్రదర్శించారు.
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోప్లాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు.. జంట రూపంలో బొమ్మలు ఏర్పాటుచేశారు. దూరం నుంచి చూస్తే.. రైతు దంపతులే పొలం పనుల్లో నిమగ్నమైనట్లు కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే తప్ప అవి బొమ్మలనే విషయం తెలియదు.
ఉత్తర ఇంగ్లాండులో రోమన్ సామ్రాజ్య చిహ్నంగా నిలిచిన చారిత్రక హేడ్రియన్స్ గోడ పక్కనున్న దాదాపు 300 ఏళ్ల సైకమోర్ చెట్టును రాత్రికి రాత్రి ఎవరో నేలకూల్చారు. చెట్టు మొదలు భాగాన్ని రంపంతో కోసినట్లుగా కనిపిస్తోంది.
పల్నాడు జిల్లా వెల్దుర్తి ప్రాంతంలో తాగునీటి సమస్యకు ఈ చిత్రం అద్దంపడుతుంది. వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో ఊరికి మధ్యనున్న బావి వద్ద మోటారు పెట్టుకొని అక్కడి నుంచి నీటి సరఫరాకు ఇంటి వరకు పైపులు అమర్చుకున్నారు.
నేలపై రంగు రంగుల చీరలు పరిచి ఉంచిన ఈ దృశ్యం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలోనిది. ఇక్కడి రైలు గేటు సమీప పొలంలో కావూరి లాజర్ అనే రైతు పొగాకు నారు పెంచుతున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన ఐకేపీ అధికారిణి వరలక్ష్మి.. సొంతంగా విభిన్నంగా పెయింట్ వేసుకున్నారు. పైఅంతస్తు గోడపై అక్షరాస్యత ప్రాధాన్యం తెలిపేలా బొమ్మలు స్వయంగా వేశారు. నృత్యాలు చిత్రాలతో తీర్చిదిద్దారు.
అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డులో పుట్టబంగారమ్మ గుడి సమీపంలోని పంచముఖ మహాగణపతి మండపం 10వ వార్షికోత్సవం సందర్భంగా అక్కడ ఉంచిన దాదాపు వెయ్యి కిలోల లడ్డూ భక్తులను ఆకట్టుకుంటోంది.
అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు జీవనసాధికి ఆటంకం ఏర్పడింది. చేపల వేటకు సముద్రంలోకి దిగడానికి జోరు వానలతో సాహసం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కార్వార తీరంలో లంగరు వేసిన పడవలను చిత్రంలో చూడవచ్చు.
జన సమీకరణ కోసం ఆర్టీసీ బస్సులను కేటాయించడంతో ప్రధాన, సిటీ బస్టాండులో బస్సులు లేక ప్రయాణికులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ఎంతసేపు ఎదురుచూసినా బస్సులు రాలేదు. సిటీ టెర్మినల్ ప్రయాణికులతో కిక్కిరిసింది.
శంషాబాద్ విమానాశ్రయం ప్రతిష్ఠాత్మక టైఫూన్ ఎయిర్క్రాఫ్ట్లకు ఆతిథ్యమిచ్చింది. రక్షణ అవసరాలకు వినియోగించే నాలుగు టైఫూన్ ఎయిర్క్రాఫ్ట్లతో పాటు మల్టీరోల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్బస్ 330 కూడా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
ఇచ్ఛాపురం ప్రాంత వాసులను హడలెత్తిస్తున్న వానరాలను బంధించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కౌన్సిల్ తీర్మానం మేరకు కోతులు పట్టే ఏజెన్సీకి బాధ్యత అప్పగించారు. ఇచ్ఛాపురం న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం బోనులు అమర్చి 110 వానరాలను పట్టుకున్నారు.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా దీపోత్సవాలు ఆకట్టుకుంటున్నాయి. డెంకాడ మండలం నగరపుపేటలో ఓంకారం, శివలింగం, త్రిశూలం, వినాయకుని ప్రతిమ ఆకారంలో మహిళలు దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు.
రహదారి ప్రమాదంలో ఒక కోతిపిల్ల మరణించింది. తల్లికోతి దానిని పట్టుకొని తల్లడిల్లింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎత్తుకొని తిరిగింది. చనిపోయిన కోతిని పట్టుకొని అడవికి వెళ్లింది. అశ్వాపురం మండలం మొండికుంట అడవి సమీపంలో శుక్రవారం జరిగిన ఈ దృశ్యాలను ‘న్యూస్టుడే’ క్లిక్మనిపించింది.
ఇక్కడ కనుచూపు మేర పచ్చదనమే కనిపిస్తోంది.. వందల ఎకరాల్లో వరి సాగు చేయడంతో ప్రకృతికి ఆకు పచ్చని కోక కట్టినట్లుగా కనువిందు చేస్తోంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ కోటపై నుంచి కనిపించిన దృశ్యాన్ని ‘న్యూస్టుడే’ కెమెరాలో బంధించింది.