చిత్రం చెప్పే విశేషాలు
(02-10-2023/2)
ఏడుపాయల ఆలయ సమీపంలోని వనదుర్గా ప్రాజెక్టు వద్ద ఆదివారం సందర్శకుల తాకిడి నెలకొంది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు, సింగూరు నుంచి దిగువకు నీటి విడుదలతో ప్రవాహం కొనసాగడంతో ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. అమ్మవారిని దర్శించుకున్న వారు జలాశయం వద్దకు చేరుకుని జల సవ్వడులను ఆస్వాదించారు.
హైదరాబాద్లో వివిధ రకాల థీమ్లతో రెస్టారెంట్లు ఆకట్టుకుంటున్నాయి. వినియోగంలో లేని పాత విమానాలను కొనుగోలు చేసి వినియోగదారుల అభీష్టానికి అనుగుణంగా వాటిని రెస్టారెంట్లుగా మార్చుతున్నారు.
నెక్లెస్ రోడ్డులో ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో భాగంగా సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ, నటి, జంతు ప్రేమికురాలు అక్కినేని అమల, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్, జడ్సీ వెంకటేష్ దోత్రె తదితరులు చీపుళ్లు పట్టుకుని 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పార్కింగ్ ప్రదేశంలో ఊడ్చారు.
గాంధీ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని ఎస్కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడు పుప్పాల బాపిరాజు గాంధీ చిత్రాన్ని ఇండియా అనే అక్షరాలతో ఇలా తీర్చిదిద్దారు. ఈయన్ను పలువురు అభినందించారు.
ముంబయిలో వినాయక చవితి వేడుకల సందర్భంగా భక్తులు సమర్పించిన ఆభరణాలు, ఇతర కానుకలను ఆదివారం రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ ప్రతినిధులు వేలం వేశారు.
హైదరాబాద్: మణప్పురం మిస్ సౌత్ ఇండియా 21వ ఎడిషన్ 2023 గ్రాండ్ ఫినాలేలో మిస్ క్వీన్ తెలంగాణ టైటిల్ను అనూష కంఠం సొంతం చేసుకున్నారు.
అనపర్తి సత్య డ్రాయింగ్ అకాడమీకి చెందిన లాజర్ అనే విద్యార్థి పెన్సిల్ ముల్లుపైన, మల్లిడి స్వర్ణ అనే విద్యార్థిని బియ్యం, నూక, వాటర్ కలర్స్తో కలిపి బాపూజీ చిత్రాలు గీసి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
అక్టోబరు ప్రారంభం కావడంతో మన్యంలో వాతావరణంలో మార్పులు వచ్చాయి. రెండుమూడు రోజులుగా చలిగాలుల తాకిడి పెరిగింది. అతిశీతల ప్రాంతంగా గుర్తింపు పొందిన లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. చలి గాలులు వీస్తున్నాయి.
దేశస్వాతంత్య్ర సాధనకు అవిరళ కృషి చేసిన మహాత్ముడికి దైవంగా భావించి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామస్థులు పూజలు చేస్తున్నారు. 46 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం కొనసాగుతోంది.
సిద్దిపేటకు చెందిన యువ పత్ర చిత్రకారుడు వైట్ల రాము.. రావి ఆకుపై లాల్ బహదూర్ శాస్ర్తిపై అభిమానంతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. సంబంధిత చిత్రాన్ని ఆదివారం విడుదల చేశారు.