చిత్రం చెప్పే విశేషాలు
(19-10-2023/2)
గరుడోత్సవం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయ అలంకరణను తితిదే మార్పు చేసింది. దీంతో ఆలయం సరికొత్త శోభను సంతరించుకుంది.
పట్టాలపై పరుగులు తీసే రైలింజిన్ ఓ ట్రాలీపైకి ఎక్కింది. బుధవారం రైలింజిన్ను జాతీయ రహదారి-44పై హైదరాబాద్ వైపు తరలిస్తున్న ట్రాలీని చోదకులు జడ్చర్ల సమీపంలో రోడ్డు పక్కన నిలిపారు. ఈ వాహనానికి 40 టైర్లు ఉన్నాయి.
పూడిమడక మత్స్యకారులకు ఏడు అడుగుల సొర చేప చిక్కింది. చేపలవేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులకు 120 కేజీల బరువు ఉండే తెల్లటి చేప చిక్కడంతో ఆనందం వ్యక్తంచేశారు. ఈచేపను కొండయ్య అనే వ్యాపారి రూ. 36 వేలకు కొనుగోలు చేశారు.
శివాజీపార్కులో విశాఖ జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో పెద్దసంఖ్యలో స్కేటర్లు పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తున్నారు.
ఆటో వెనుక కూర్చొని ప్రయాణించడమే ప్రమాదమనుకుంటే ఒడిలో చిన్నారులను పట్టుకొని ఓ మహిళ ప్రయాణిస్తున్న సంఘటన బుధవారం దివాన్చెరువు జాతీయ రహదారిపై కనిపించింది. అసలే పరిమితికి మించి.. ఆపై ప్రమాదకర స్థితిలో ప్రయాణం చేస్తున్నారు.
దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని పాపన్నపేట మండలం మల్లంపేటలో అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించి భక్తులు పూజలు చేశారు.
చిన్నచింతకుంట మండలం మద్దూర్కు చెందిన రైతు అంజన్న తన మూడున్నర ఎకరాల పొలంలో రెండేళ్ల క్రితం 1,750 దానిమ్మ మొక్కలు నాటారు. ప్రస్తుతం తోట కాయ దశలో ఉంది. చీడపీడల నుంచి రక్షించుకునేందుకు రూ.1.30 లక్షలతో వ్యయంతో దోమతెరలను కొనుగోలు చేసి తోటపై పరిచారు.
ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెదయడ్లగాడి వంతెన సమీపంలో నిశ్చల కొల్లేరుపై పరుచుకున్న పుష్పపీటాల నుంచి విచ్చుకున్న శ్వేత వర్ణాలు. దూరం నుంచి చేస్తే నీలి రంగు నీటి అందాలు.. తెప్పపై మత్స్యకారుడు, ఆకాశానికేసి చూస్తున్న పూలు సోయగం ఇట్టే కట్టిపడేస్తున్నాయి.
షార్ట్ సర్క్యూట్ కాకుండా నియంత్రికకు ఇలా బాటిళ్లు పెట్టారు. గాలి వానకు వైర్లు అటు ఇటు జరగకుండా ఉండేందుకు పెట్టామని లైన్ మెన్ శ్రీనివాస్ తెలిపారు. సంగెం మండలం ఎల్గుర్ రంగంపేట -తిమ్మాపూర్ రోడ్లో తీసిన చిత్రం.