చిత్రం చెప్పే విశేషాలు (03-11-2023/1)
మహారాష్ట్రకు చెందిన రోహిదాస్ మూడు నెలలు పాటు శ్రమించి లోహపు వ్యర్థాలతో 1930 నాటి మోడల్లో విద్యుత్ కారును తయారు చేశాడు. ఇద్దరు కూర్చోవడానికే వీలుగా ఉండే ఈ కారుకు ఐదు బ్యాటరీలను అమర్చాడు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
మహారాష్ట్రలోని పుణె జిల్లా ఎరవాడ జైలులో ఉంటున్న కొందరు ఖైదీలు గత ఆగస్టులో శృంఖల ఉపహార్ గృహ్ పేరుతో దీన్ని ప్రారంభించారు. ఆ టిఫిన్ సెంటర్కు వెళ్లిన వారికి ఖైదీలు సాదరంగా స్వాగతం పలుకుతారు. రుచికరమైన ఆహారాన్ని వండి అతిథి మర్యాదలతో వడ్డిస్తారు. పాత్రలను శుభ్రం చేసేదీ వారే.
అందమైన ముద్దుగుమ్మలు పలువురు మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో సందడి చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. పలువురు రూపదర్శినులు సరికొత్త డిజైన్ దుస్తులు, ఆభరణాలు ధరించి హొయలుపోయారు.
ప్రచారంలో భాగంగా అడ్డగుట్టలో పర్యటించిన సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్ ఓ సెలూన్లో కటింగ్ చేసి అలరించారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లి తండాకు చెందిన దీప ఎంటెక్ చేసి సీఎంఎస్టీఈఐ పథకం గురించి తెలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో 3 నెలలు శిక్షణ తీసుకుని మీర్పేటలో డీఎస్ మార్ట్ సూపర్ మార్కెట్ను స్థాపించి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
చింతపల్లి మండలం చెరువులవెనానికి వారాంతాల్లోనే కాక సాధారణ రోజుల్లోనూ దూరప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. ఇక్కడ కొండపై పాలకడలిని తలపించే మంచు అందాలను తమ చరవాణుల్లో బంధిస్తున్నారు.
‘సకల ఆత్మల పండుగ’ను గురువారం నారాయణగూడ క్రైస్తవ శ్మశానంలో నిర్వహించారు. పెద్దసంఖ్యలో క్రైస్తవులు తమ కుటుంబ సభ్యులతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కెన్యాలోని మొంబాసా సముద్రతీరంలో గురువారం ఫ్లిప్ఫ్లోపీ సభ్యులతో బ్రిటన్ రాజు ఛార్లెస్-3. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ నిర్మూలనకు, సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ సంస్థ కృషిచేస్తుంది.
బెంగళూరు రాజధాని నగరంలోని విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రదర్శనాలయం (విట్)లో చంద్రయాన్-3 నమూనా మాడ్యూల్ను ప్రదర్శించారు. ప్రజ్ఞాన్, రోవర్లోతో పాటు చంద్రుని ఉపరితలంపై అది ఇప్పటి వరకు చేసిన పనులను తెలుసుకునేందుకు ఫలకాలను ఏర్పాటు చేశారు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజు గురువారం కొనసాగింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది.