చిత్రం చెప్పే విశేషాలు
(10-11-2023/1)
వినుకొండ మండలం గోకనకొండకు చెందిన చిత్రకారుడు వల్లెం కృష్ణకు జాతీయ స్థాయి అవార్డు వరించింది. చోడవరం చిత్రకళా నిలయం వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళా పోటీల్లో కృష్ణ చిత్రించిన ‘ మాతృత్వం’ చిత్రానికి జాతీయ స్థాయిలో మెరిట్ ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నారు.
హైదరాబాద్ నగరంలో దీపావళి సందడి మొదలైంది. పలు ప్రాంతాల్లో రహదారుల పక్కన విభిన్న ఆకృతుల్లో ప్రమిదలు, దీపపు దిమ్మెల అమ్మకాలు సాగుతున్నాయి. అమీర్పేట రోడ్డులో ఆకట్టుకునే రీతుల్లో ఇవి కొలువుదీరడంతో కొనుగోళ్లు జోరందుకున్నాయి.
హైదరాబాద్లో ఆటోలో రాళ్లను తెచ్చి తూకం వేసి మరీ అమ్ముతున్నారనుకునేరు? ఇవి రాళ్లు కాదు.. ఆరోగ్యానికి ఎంతోమేలు చేసే రాక్ సాల్ట్. పంజాబ్కు చెందిన వ్యక్తి కిలో రూ.80కు విక్రయిస్తున్న ఈ దృశ్యం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.
ఎన్నికల ప్రచారంలో మనుషులే కాదు.. పక్షి జాతులు పాల్గొంటున్నాయి. ఇదేంటి అనుకుంటున్నారా.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో గురువారం ఓ కోడిపుంజు ఇలా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. దాని వీపుభాగంలో భారాస అభ్యర్థి ఇంద్రకరణ్రెడ్డి ఎన్నికల ప్రచార గోడప్రతి అతికి ఉంది.
చేవెళ్ల భారాస అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రచారశైలే వేరు. గురువారం తన నామినేషన్ సందర్భంగా గుర్రంపై వచ్చి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు.
తిరుమలలో వర్షంతోపాటు కమ్ముకున్న మంచుతో గురువారం ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దీంతో చలితీవ్రత పెరిగింది. భక్తులు కొంతవరకు ఇబ్బంది పడుతున్నా.. ప్రకృతి రమణీయతకు పులకించిపోతున్నారు.
చెట్టు మీద అందంగా కనిపించే ఈ పాము ఒక విషరహిత సర్పం. మోతుగూడెం పంచాయతీ ఎంసీడీడీ క్యాంపు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలోని పూల మొక్కల్లో పచ్చదనం వర్ణంలో కలిసిపోయిన పసరిక పామును విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం ఆసక్తిగా తిలకించారు.
అంబర్పేట నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి కృష్ణయాదవ్, పార్టీ సీనియర్ నేతలు కిషన్రెడ్డి, గీతామూర్తి, గౌతంరావు తదితరులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అందోలు నియోజకవర్గానికి సంబంధించి నామపత్రాలు వేయడానికి ముందుగా కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ వచ్చారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత దాఖలు చేయడానికి భాజపా అభ్యర్థి బాబూమోహన్ లోపలికి వెళ్తుండగా ఇద్దరూ ఎదురుపడ్డారు.
వెలుగోడు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద సోమవారం జొన్న, మినుము, సోయాబీన్ పంటలు నూర్పిడి చేసే యంత్రంపై ఐదురుగు మహిళలు ప్రమాదకరంగా ప్రయాణించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.