చిత్రం చెప్పే విశేషాలు
(12-01-2024/1)
జాతీయ యువ దినోత్సవాల సందర్భంగా బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దాడు. బ్రహ్మపుర శివారు హరడాఖండిలోని స్వామి వివేకానంద పాఠశాల ఆవరణలో స్వామి వివేకానందుడి ఆకృతి, పచ్చదనానికి ముందుకు సాగాలన్న నినాదాలతో శిల్పాన్ని రూపొందించాడు.
నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది.. నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుందంటూ యువతలో స్వామి వివేకానంద చైతన్యం తీసుకొచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకుపై చిత్రాన్ని మలిచారు.
సంక్రాంతి వచ్చిందంటే.. ప్రకృతి అందాలు, కొత్త పంటల రాక.. పిండి వంటల గుబాళింపు..హరిదాసు హడావుడి.. ఇంటి ముంగిట వేసే రంగువల్లులతో కొత్త కళ సంతరించుకుంటుంది. ఈ సమయంలో చిన్నారులు పతంగుల ఆటల్లో జాగ్రత్తలు తీసుకుంటే పండగ సంతోషాలతో సాగిపోతుంది.
ఏటా సంక్రాంతి పండగకు కొత్త మట్టి పాత్రల్లో వంటలు చేసి పూర్వీకులకు ప్రసాదం వండి పెడుతుంటారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంప్రదాయం నేటికీ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా గురువారం జలుమూరు మండలం నారాయణవలస సంత కేంద్రంగా మట్టిపాత్రలు విక్రయాలు జోరుగా సాగాయి.
చెన్నై అశోక్నగర్లోని కరుమారి త్రిపుర సుందరి ఆలయంలోని వీరాంజనేయస్వామికి 1,00,008 వడలతో అలంకరణ చేశారు.
విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో గురువారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. రంగవల్లులు, పొంగళ్ల వంటకాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం కళకళలాడింది. వీటిని తిలకించేందుకు నగర ప్రజలు భారీగా తరలివచ్చారు.
మీరాలం ట్యాంక్ చెరువు సుందరీకరణ గతేడాది రూ.2.55 కోట్లతో చేశారు. అయితే నిర్వహణ కరవై మ్యూజికల్ ఫౌంటెయిన్ కేవలం 5 నెలలు పనిచేసింది. ఉద్యానం పనులు సైతం అసంపూర్తిగా ఉన్నాయి.
ఈ చిత్రంలోని వారు రోడ్డు పని చేసే కూలీలనుకుంటే పొరపాటు.. వీరంతా స్థానిక గీత కార్మికులు. ఆదిభట్ల - ఓఆర్ఆర్కు అనుబంధంగా కల్వర్టు నిర్మించినా రహదారి పనులకు కంకర, డస్టు పోసి వదిలేయడంతో విపరీతంగా దుమ్ము లేస్తోంది. దీంతో సమీప బోరు నుంచి పైపులతో రోడ్డుపై నీళ్లు చల్లుతున్నారు.
వానలు కరవైనా.. కష్టపడి సాగుచేసిన పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదంటూ ‘ఏళు అమావాస్య’ నేపథ్యంలో రైతు కుటుంబాల వారు గురువారం ఇలా పూజలు చేసి.. ప్రకృతిమాతను ప్రార్థించారు. జిల్లా కేంద్రం బాగల్కోటె సమీపాన కనిపించిన ఓ పూజా ఘట్టం ఇదీ.
ఒడిశా రాష్ట్రం నుంచి స్మార్ట్ సిటీ హోదా దక్కించుకొని, గర్వకారణంగా నిలిచిన రవుర్కెలా నగరం మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోనే మార్గదర్శకంగా నిలుస్తున్న మొదటి 15 నగరాల జాబితాలో చోటు దక్కించుకుంది.