చిత్రం చెప్పే విశేషాలు
(12-01-2024/2)
మానవ కార్యకలాపాల వల్ల భూమి వేడెక్కుతూ.. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో మంచు కరిగిపోతోందని అమెరికాలోని డార్ట్ మత్ కళాశాల పరిశోధకులు గుర్తించారు. భూతాపం వల్ల దట్టమైన మంచు ఏర్పడకపోవడంతో వసంతకాలం తరవాత నదుల్లో ప్రవాహం తగ్గిపోయి జనాభాకు నీటికొరత ఎదురవుతుందని పరిశోధకులు హెచ్చరించారు.
సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. శుక్రవారం నుంచి పండగ సెలవులు కావడంతో ప్రజలు నగరం నుంచి పల్లెబాట పట్టారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ 70mm థియేటర్కు సినీనటుడు మహేశ్బాబు వచ్చారు. ‘గుంటూరు కారం’ చిత్రాన్ని అభిమానులతో కలిసి వీక్షించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను హైదరాబాద్లోని ఆయన నివాసంలో వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను భట్టి విక్రమార్కకు అందజేశారు.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు యాగశాలలో ఉత్సవాల ప్రారంభ పూజలు నిర్వహించారు.
ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎస్టీయూ వజ్రోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హాజరై మాట్లాడారు. అంతకుముందు ఎస్టీయూ వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించారు.
అజ్మేర్ దర్గాకు పంపించే చాదర్ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిల్లీలో గురువారం ముస్లిం ప్రతినిధులకు అందజేశారు. చిత్రంలో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తదితరులు ఉన్నారు.
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఘనంగా కూడారై ఉత్సవం ప్రారంభమైంది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా రామాలయంలో స్వామి, ఆండాలమ్మ వార్లకు 108 పాత్రలతో పరమాన్న ప్రసాదం నైవేద్యంగా సమర్పించారు.
గిట్టుబాటు ధరలకే మిర్చి కొనుగోలు చేయాలని వ్యాపారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం మిర్చి మార్కెట్ను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ధరను గణనీయంగా తగ్గిస్తున్నారంటూ రైతులు మంత్రి ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు.