చిత్రం చెప్పే విశేషాలు

(20-01-2024/2)

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పురపాలకలోని శివాజీనగర్‌ కాలనీకి చెందిన యువకుడు, సూక్ష్మ కళాకారుడు సంతోష్‌చారి పెన్సిల్‌ లెడ్‌ ఉపయోగించి అంగుళం పొడవు 1.5 అంగుళాల వెడల్పుతో అరచేతిలో ఇమిడే అయోధ్య రామ మందిరం నమూనా రూపొందించారు. 48 గంటలు శ్రమించినట్లు ఆయన పేర్కొన్నారు. 

నిర్మల్‌ పట్టణంలోని బంగల్‌పేట్‌కు చెందిన బిట్లింగ్‌ రాజేంద్ర అనే సూక్ష్మకళ నిపుణుడు ఉడతాభక్తిగా తన కళనే రాముడికి నివేదించాలనుకున్నారు. ఈ క్రమంలో బియ్యం గింజలతో రంగులు జతచేసి రామాలయం, ఉడుతను ఆప్యాయంగా నిమురుతున్న శ్రీరాముడి చిత్రపటాలను రూపొందించారు. 

బెంగళూరు రాజధాని నగరంలోని గిరినగర ఠాణాలో ఎస్సైగా సేవలందిస్తున్న.. మడికేరి జిల్లా కుశాలనగరకు చెందిన మంజునాథ్‌ ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పురస్కరించుకుని తన కుంచెతో కాన్వాసుపై మందిరం నమూనాను గీచారు. 

ఆర్కేబీచ్‌ సమీపంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన ‘మెరైన్‌పార్కు ఎగ్జిబిషన్‌’లో పాములు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిని పట్టుకున్నా ఏమీ చేయవు. పైథాన్‌ జాతికి చెందిన వీటిని కొందరు మెడలో వేసుకొని ఎంచక్కా చిత్రాలు తీసుకుంటున్నారు. 

అరసవల్లికి చెందిన సూక్ష్మ చిత్ర కళాకారుడు వాడాడ రాహుల్‌ పట్నాయక్‌ మామిడి ఆకుపై శ్రీరామమందిర చిత్రాన్ని గీశారు. అయోధ్యలో ఈనెల 22న ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా తీర్చిదిద్దిన చిత్రం ఆకట్టుకుంటోంది. 

ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యనారాయణపురానికి చెందిన రైతు కిలారి సాంబశివరావు 20 ఎకరాల్లో పెసర పంట సాగు చేస్తున్నారు. పూత, కాయ దశకు వచ్చే సమయానికి చీడపీడలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు యంత్రంతో పురుగు మందులు పిచికారీ చేయిస్తున్నారు. 

ఖానాపూర్‌ మండలంలోని పాత ఎల్లాపూర్‌ గ్రామంలో ఖానాపూర్‌-కడెం ప్రధాన రహదారి పక్కన రెండు నెలలుగా మిషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలి నీరు వృథాగా పోతోంది. లీకేజీ నీటితో ఆ ప్రాంతం చుట్టు పక్కల తడిగా మారడంతో పక్కనే ట్రాన్స్‌ఫార్మర్ల కోసం ఏర్పాటు చేసిన గద్దె కుంగి పక్కకి వంగింది. 

కీసర పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో శుక్రవారం మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలింది. ఎయిర్‌వాల్వ్‌ ఊడి పోవడంతో లీకేజీ ఏర్పడింది. చాలా సమయం పాటు నీళ్లు వృథాగా పోయాయి. మిషన్‌ భగీరథ అధికారులకు సమాచారం వెళ్లినా ఆలస్యంగా స్పందించారు.

బేగంపేట నుంచి బల్కంపేటకు వచ్చే సబ్‌వే రహదారి మలుపులో విద్యుత్‌ కేబుల్‌కు సంబంధించిన పెద్ద బాపిన్‌ను నెల రోజులుగా వదిలేశారు. కేబుల్‌ పనులు పూర్తయ్యాక దాన్ని అక్కడి నుంచి తరలించలేదు. బాపిన్‌ కింద రాళ్లు జారిపోతే దొర్లుకుంటూ రోడ్డుమీదికి వచ్చే ప్రమాదం ఉంది. 

ఈ నెల 22న అయోధ్యలో రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారణాసికి చెందిన సోనీ చౌరాసియా 228 కి.మీ.లు స్కేటింగు చేస్తూ 17న అయోధ్యకు పయనమైంది. 

చిత్రం చెప్పే విశేషాలు(27-07-2024)

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

Eenadu.net Home