చిత్రం చెప్పే విశేషాలు
(01-02-2024/1)
మణుగూరులోని రథంగుట్టపై మంచుతెరలను చీల్చుకుంటూ ఉదయించే సూర్యుడి దృశ్యాలు ఔరా అనిపిస్తున్నాయి. శీతాకాలంలో మంచు కారణంగా దట్టమైన మంచుతో నిండిపోయిన ఆ గుట్టపై నుంచి తెల్లవారుజామున ఎర్రని కాంతులతో సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యాలను ఉదయం నడకకు వచ్చినవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాల్లో కల్లాలు మిర్చి రాశులతో కళకళలాడుతున్నాయి. తేమ తగ్గేలా రైతులు కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలు దూరం నుంచి చూసిన వారికి పొలమంతా ఎర్రని తివాచీ పరిచినట్లుగా కనువిందు చేస్తున్నాయి.
బహుళ అంతస్తుల భవన సముదాయాలు, పైవంతెనల హంగులతో ఐటీ క్షేత్రం మెరిసిపోతోంది. బుధవారం రాత్రి విద్యుద్దీపాల వెలుగు జిలుగుల మధ్య కొండాపూర్లో ఫ్లైఓవర్ ప్రాంతం కనువిందు చేసిందిలా.
మారుతున్న కాలంతో పాటే వేగంగా సాంకేతికత వినియోగం పెరుగుతోందని చెప్పడానికి నిదర్శనమీ చిత్రం. అమ్మకానికి ఏర్పాటు చేసిన ఆటో నుంచి తరచూ ఆకుకూరలు తస్కరణకు గురవుతున్నాయని, నిఘా కోసం ఇలా సీసీకెమెరా ఏర్పాటుచేశారు. మూసారాంబాగ్ వద్ద కనిపించిన చిత్రమిది.
ఎల్బీస్టేడియం, రవీంద్ర భారతి, శాసన మండలిలో ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం, వీఐపీలు హాజరయ్యే నేపథ్యంలో లక్డీకాపూల్, బషీర్బాగ్, అబిడ్స్, తదితర ప్రాంతాల్లో గంటల తరబడి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో రాత్రి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి కనిపించిన దృశ్యమిది.
యాసంగి సీజన్ కోసం రైతులు సిద్ధమవుతున్నారు. పంటకోసం పొలంలో రైతులు శ్రమిస్తుంటే, ఆహారం కోసం మడిలో కొంగలు నిరీక్షిస్తున్నాయి. మడిలో దున్నుతున్న ట్రాక్టర్ చుట్టూ గుంపులుగా చేరి బురదలో దొరికే ఆహారంకోసం తిరుగుతూ మల్లె పూలలాగా కనిపిస్తున్నాయి.
ప్రాచీన కాలంలో రోమన్లు వినియోగిస్తున్న బంగారు, ప్లాటినం, రాగి, వెండి తదితర లోహాలతో పాటు వివిధ ఖరీదైన రాళ్లను అమర్చిన హంస హస్తకళా వస్తువును నగరంలోని ట్వింకల్ కేవియర్, మిలింద్ నాయర్ ఉద్యాననగరికి తెచ్చారు. 15వ శతాబ్దంలో అప్పటి రాజులు దాన్ని వినియోగించేవారని గుర్తు చేశారు.
అవయవాలు లేకున్నా అనుకున్న పనులు ఇబ్బంది లేకుండా సాధించుకోవచ్చని నిరూపిస్తున్నారు సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లికి చెందిన కుమ్మరి యాదగిరి. ఆయనకు ఒక చేయి లేకున్నా పంటలు సాగు చేస్తూ, వాహనంపై రైతుబజారుకు వెళ్లి విక్రయిస్తున్నారు.
ఒకే మామిడి చెట్టు ఓవైపు పూతతో, మరోవైపు పూత లేకుండా కనిపిస్తుందేమిటా అని ఆశ్చర్యపోతున్నారా.. నారాయణపేట జిల్లా దామరగిద్ద తండాకు చెందిన రైతు ఈడిగ నర్సింహులు పొలంలో అతడి తాత 30 ఏళ్ల కిందట పక్క పక్కనే రెండు మామిడి మొక్కలు నాటారు. ఒకటి పులుపుది కాగా, మరొకటి తీయనిది.
ప్రతిరోజూ వేలమంది సందర్శించే పర్యాటక ప్రాంతం ట్యాంక్ బండ్. గత ఏడాది కార్ రేసుల కోసం రహదారి మధ్యన నీలం రంగు సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి అటుఇటూ రహదారి దాటే సందర్శకులకు ఇబ్బందికరంగా మారాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద కనిపించిన దృశ్యం ఇది.