చిత్రం చెప్పే విశేషాలు
(14-02-2024/1)
పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్పూర్ పీఎస్ పరిధిలోని దియాస గ్రామంలో వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ మంగళవారం పొలంలో కూలిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఇద్దరు ట్రైనీ పైలెట్లు పారాచూట్ సాయంతో క్షేమంగా కిందకు దిగారు.
నిత్యం ఎంతో మంది ప్రేమికులు ట్యాంక్బండ్, సమీప పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఈ బుధవారం ప్రేమికుల దినోత్సవం. ట్యాంక్బండ్పై రంగుల బెలూన్లను ఓ యువతి కొనుగోలు చేస్తున్న చిత్రమిది.
మన్యంలో సీతాకోకచిలుకలు రకరకాల రంగులతో దర్శనమిస్తుంటాయి. వాటిలో ఒకటి రాజవొమ్మంగిలో మంగళవారం ఓ ఆలయ ప్రాంగణంలో వాలింది. ఆ సీతాకోకచిలుక పసుపు వర్ణంలో ఎంతో అందంగా ఉంది. రెక్కలపై గోధుమ రంగు మచ్చలతో పాటు నల్లటి గీతలు కలిగి ఉండటంతో అందరూ దీని అందానికి మైమరిచిపోయి ఆసక్తిగా తిలకించారు.
నెల్లూరు హరనాథపురానికి చెందిన ఉపాధ్యాయుడు సోమాపద్మారత్నం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా స్పందించారు. మర్రి ఆకుపై ప్రేమజంటను కార్వింగ్తో ఇలా చెక్కారు.
డ్రగ్స్ అనర్థాలపై అందరినీ ఆలోచింపజేసేలా యాంటీ నార్కొటిక్ బ్యూరో వారు నగరంలో విద్యాక్షేత్రాల చెంత గోడలపై వర్ణచిత్రాలు వేయిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నం. 45లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రహరీపై వేసిన వర్ణచిత్రం ఆకట్టుకుంటోంది.
యూఏఈలోని అబుదాబిలో స్వామి నారాయణ దేవాలయ రూపాన్ని నగరానికి చెందిన స్వర్ణకారుడు కత్రోజు యాదగిరి ఆరు రోజులు శ్రమించి బంగారు నాణెంపై 22.7 ఎంఎం వ్యాసం, 7గ్రాముల బంగారంతో దేవాలయ రూపాన్ని తయారు చేశారు. నాణేనికి ఒకవైపు శ్రీస్వామి నారాయణ, మరోవైపు ఆలయ నిర్మాణం ఉండేలా రూపొందించారు.
కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లకు సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫలితంగా మిల్లర్లు ఇవ్వాల్సిన బకాయి సీఎంఆర్ను ఎఫ్సీఐకు తరలిస్తున్నారు. దీంతో నల్గొండలోని ఎఫ్సీఐ వద్ద కలెక్టరేట్, క్రీడా మైదానం వైపు లారీలు వరుస కట్టాయి.
కొత్తూరు మండలం వసపకాలనీ - కుంటిభద్రకాలనీ మధ్యలో మెగా పథకం పైపులైను లీకేజీ కారణంగా నీరు పెద్దఎత్తున వృథాగా పోతోంది.. అనేక గ్రామాలకు దాహార్తి తీర్చే ఈ పథకం పూర్తిస్థాయిలో తాగునీరు అందించలేకపోతోంది.. తాజాగా ఈ వృథాతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రేమంటే రెండు అక్షరాలే కాదు.. రెండు మనసుల కలయిక. అందుకే ఆ ప్రేమకు గుర్తుగా ఇచ్చే బహుమతులు కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు నేటి యువత. నేడు ప్రేమికుల దినోత్సవం.. ఈ సందర్భంగా ప్రేమగా ఇచ్చే కానుక కోసం పలు బహుమతులు నగర మార్కెట్లో ఆకట్టుకుంటున్నాయి.
సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామంలో వెలిసిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎటుచూసినా అరటిగెలలే దర్శనమిస్తున్నాయి. ఆలయ యాత్రామహోత్సవంలో భాగంగా భక్తులు మొక్కుగా అరటిగెలలను చెల్లిస్తున్నారు. కోరిన కోర్కెలు నెరవేరాలనే ఉద్దేశంలో స్వామివారికి వీటిని సమర్పిస్తారు.