చిత్రం చెప్పే విశేషాలు
(22-02-2024/1)
ఎండలు మండిపోతున్నాయి. వేడికి కూరగాయలు పాడైపోకుండా ఓ చిరు వ్యాపారి నీడ కోసం గోనె సంచులు కట్టుకుంది. రెండు, మూడు గంటలకోసారి కూరగాయలపై నీళ్లు చల్లుతూ వాడిపోకుండా కాపాడుకుంటుంది.
హైదరాబాద్ - విజయవాడ రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోతోంది. విజయవాడ వైపు వాహనాలు సాఫీగా వెళుతుండగా, అబ్దుల్లాపూర్మెట్ వద్ద రహదారి వంపులు తిరిగి ఉండటంతో నగరం వైపు వచ్చే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
భాజపా ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రంలో భాగంగా గురువారం జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో భారీ బహిరంగ సభలో ఆ పార్టీ నేత ఈటల రాజేందర్ నాయకులు మాట్లాడారు.
మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్తో ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే నిర్బంధించారు. దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
భక్తకోటి జయజయధ్వానాల మధ్య మేడారం మహాజాతర బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు, పగిడిద్దరాజు, గోవిందరాజులనూ తీసుకువచ్చి గద్దెలపై కొలువుదీర్చారు.
గ్రామ పంచాయతీలో సర్పంచులు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాసన సభ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించారు.
ఉష్ణోగతలు పెరిగిపోతున్నాయి. జలాలు అడుగంటిపోతున్నాయి. పబ్లిక్గార్డెన్లో ఉన్న నీటి కొలను ఇది. ఎండల కారణంగా దాదాపుగా ఎండిపోయి.. అరకొర నీరే కనిపిస్తోంది. కొద్దిరోజుల్లో పూర్తిగా మైదానంలా మారనుంది.
సైన్స్ వారోత్సవాల్లో భాగంగా సుజాతనగర్ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో బుధవారం గుండె పనితీరుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మైదానంలో గుండె ఆకృతిలో నిలబడి విన్యాసం చేశారు. సైన్సు ఉపాధ్యాయులు రక్త ప్రసరణ వ్యవస్థ గురించి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు
తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని చింతపల్లి విజ్ఞాన భారతి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు అక్షర రూపంలో విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది.
దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెట్టిన జవానుల సంస్మరణార్థం గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లోని వార్ మెమోరియల్లో 108 అడుగుల జాతీయ జెండాను బుధవారం ఆర్మీ అధికారులు ఆవిష్కరించారు.