చిత్రం చెప్పే విశేషాలు
(23-02-2024/1)
‘మిలాన్-2024’ నేపథ్యంలో అంతర్జాతీయ నగర కవాతుకు ఆర్కే బీచ్ వేదికైంది. నౌకాదళం ఆధ్వర్యంలో గగన తలంలో, సముద్ర జలాల్లో చేపట్టిన విన్యాసాలు అందరినీ అబ్బురపరచాయి. యుద్ధ సమయంలో ప్రదర్శించే వ్యూహాత్మక విన్యాసాలతో ‘హాక్ జెట్లు’ ఔరా అనిపించాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. మరోవైపు గాజాపై టెల్ అవీవ్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం రాత్రి నుంచి జరుగుతున్న దాడుల్లో పలువురు పాలస్తీనీయన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది.
భాజపా ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రంలో భాగంగా శుక్రవారం కుమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏటా వేసవిలో నగరవాసులు చాలా మంది ఇళ్లలో చల్లని నీరు తాగేందుకు కుండలు, కూజాలను కొనుగోలు చేస్తారు. ఈ దఫా ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతుండటంతో రోడ్ల పక్కన కుండల విక్రయాలూ మొదలయ్యాయి. మలక్పేటలో అమ్మకానికి కొలువుదీరాయిలా.
మేడారం జాతరకు వేలాదిగా సిటీ బస్సులు తరలివెళ్లిన వేళ.. నగరంలో చాలా ప్రాంతాల్లో గంటకో బస్సుకూడా కనిపించడం లేదు. ఉన్న బస్సులన్నీ కాలుకూడా పెట్టలేనంత రద్దీతో తిరిగాయి. మహిళలు, కండక్టర్ సైతం ఫుట్బోర్డులపై నిల్చుని ప్రయాణిస్తున్న పరిస్థితి కొనసాగింది.
పోగైన చెత్తను తరలించే వాహనం ఇది. మరమ్మతుకు గురికావడంతో మరో వాహనానికి తగిలించి తీసుకెళ్తున్న ఈ దృశ్యం ట్యాంక్బండ్ వద్ద కనిపించింది.
నూజివీడు పట్టణంలో కోతులను కట్టడి చేసేందుకు ఎలుగుబంటి వేషధారణలో పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ కార్మికులు గురువారం సంచరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శానిటరి ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ అధికారుల ఆదేశంతో రోజుకి నాలుగు వార్డుల చొప్పున సంచరించనున్నట్లు తెలిపారు.
తమిళనాడులోని అడయారు తిరు.వి.క వంతెన సుందరీకరణలో భాగంగా గోడలపై పక్షుల బొమ్మలు చిత్రీకరిస్తున్న దృశ్యం.
యాచారంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కస్తూర్బా పాఠశాల వద్ద విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాఠశాల గోడ మీద ఉండటంతో పిల్లలు భయపడుతున్నారు. వీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.