చిత్రం చెప్పే విశేషాలు
(28-02-2024/1)
హైదరాబాద్లోని తెలుగు వర్సిటీలో మంగళవారం గురుకుల పాఠశాలల టీజీటీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు మహిళలు తమ పిల్లలతో సహా హాజరయ్యారు. ఆ చిత్రాలను న్యూస్టుడే క్లిక్మనిపించింది.
హైదరాబాద్లోని సీతాఫల్మండి ప్రధాన రహదారి పక్కన వెలగ పండ్లను ఇలా పోసి అమ్ముతున్నారు. వీటిలో విటమిన్లు మెండుగా ఉంటాయని స్థానికులు తెలిపారు.
మంజీరా పైపులైన్ వాల్వ్ ఊడిపోయి ఉవ్వెత్తున నీరు విరజిమ్మింది. పాత ముంబయి రహదారి చందానగర్ శ్రీదేవి థియేటర్ వద్ద అమీన్పూర్కు వెళ్లే మంజీరా 300ఎంఎం సామర్థ్యం గల పైపులైన్ వాల్వ్ను మున్సిపల్ చెత్త వాహనం వచ్చి ఢీకొట్టింది. దీంతో నీరు 20 అడుగుల ఎత్తు వరకు చిమ్మింది.
కర్ణాటక రాష్ట్రాన్ని కరవు పరిస్థితులు కుదిపేస్తున్నాయి. తక్కువ వర్షపాతం కారణంగా జలవనరులు తడారిపోయాయి. చెరువులు, కుంటలు, నదుల్లో నీటి చుక్క కానరాని పరిస్థితి. చిక్కమగళూరు సమీప హంపాపుర గ్రామ శివార్లలో పశువులను నీటి కోసం నడిపించుకు వెళుతున్న రైతన్నకు దిక్కెవరు?
బజార్హత్నూర్ ఆదర్శ పాఠశాలకు చుట్టుపక్కల వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి వస్తుంటారు. పాఠశాలకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఇలా ప్రమాదకరంగా ప్రయాణించడం పరిపాటిగా మారింది. సకాలంలో చేరుకోవాలన్న తొందరలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
మోదుగ చెట్టు పూలను మరిగిస్తే ఎలాంటి రసాయనాలు అవసరం లేకుండా చక్కటి రంగు తయారవుతుంది. ఆకులన్నీ రాలిపోయి.. ఎర్రటి పూలతో మోదుగ చెట్టు ఆకట్టుకుంటున్న దృశ్యాన్ని పిట్లం మండలం చిన్నకొడప్గల్ శివారులో ‘న్యూస్టుడే’ క్లిక్మనిపించింది.
తూటిపాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు బి.రవికుమార్ ఆవగింజలతో సర్ సి.వి.రామన్ ముఖ చిత్రాన్ని రూపొందించాడు. జాతీయ సైన్సు దినోత్సవం సందర్భంగా ఆరు గంటలు శ్రమించి 817 ఆవగింజలతో ఆయన ముఖచిత్రాన్ని రూపొందించానని కళాకారుడు తెలిపారు.
పూడిమడకకు చెందిన నలుగురు మత్స్యకారులు మంగళవారం భారీ కోనాం చేపలతో తిరిగి వచ్చారు. వీరికి చిక్కిన చేపల్లో నాలుగున్నర అడుగు కోనాం ఉంది. దీనిని చూసేందుకు మత్స్యకారులు సైతం ఆసక్తి చూశారు. ఈ చేపను వ్యాపారి శ్యామ్ కొనుగోలు చేశాడు. కేజీ చేప రూ.800 చొప్పున ధర పలికింది.
వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భజలాలు అడుగంటి పోయాయి. కొన్నిచోట్ల పొట్ట దశలో నీరందక భూములు తడారి నెర్రెలు బారుతున్నాయి. సంస్థాన్ నారాయణపురంలో ఓ రైతు ఎండిన పంట పొలాన్ని చేసేదేమి లేక మూగజీవాలను మేతగా మేపుతుండగా ‘న్యూస్టుడే’ క్లిక్మనిపించింది.
ఓ పక్క ఎండలు మండుతున్నా ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న చిత్రమిది. ఏఎమ్మార్పీ జాలునీటితో నిండిన ఈ ప్రాంతంలో కొంగలు దాహం తీర్చుకుని సేదతీరుతున్న దృశ్యం ఇక్కడ చూడవచ్చు. మండలం పరిధిలోని కొయిగూరోనిబాయి గ్రామం పరిసరాల్లో న్యూస్టుడే కెమెరా కంటికి చిక్కిన ఈ దృశ్యం కమనీయంగా ఉంది కదూ.