చిత్రం చెప్పే విశేషాలు

(27-03-2024/1)

రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని రాయదుర్గం మెట్రోస్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన చార్మినార్‌ నమూనా ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

విజయవాడలో 23న స్ఫూర్తి శ్రీనివాస్‌ నిర్వహించిన జాతీయ చిత్రకళా పోటీల్లో వినుకొండ చిత్రకారుడు వజ్రగిరి జెస్టీస్‌ గీసిన పిచ్చుకలను రక్షించండి (సేవ్‌ స్పేరో) చిత్రానికి తృతీయ బహుమతి లభించింది. 

నెల్లూరు ముత్తుకూరు సెంటర్‌ నుంచి చిల్డ్రన్స్‌ పార్కుకు వెళ్లే మార్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన సింహపురి సింహం బొమ్మ ఇది. ఇనుప వస్తువులతో తయారు చేసిన ఈ బొమ్మ కోసం భారీగానే ఖర్చు చేశారు. ఇది నగరవాసులను ఆకర్షిస్తోంది.

ఈ చిత్రం.. ఉప్పల్‌ నల్లచెరువు. కొన్ని నెలలుగా గుర్రపుడెక్క పేరుకుపోయింది. చుట్టుపక్కల పరిశ్రమల నుంచి రసాయన, కాలుష్య నీరు ఈ చెరువులో కలుస్తోంది. రాత్రుళ్లు స్థానికులకు ముక్కుపుటాలు అదురుతున్నాయి. కంటి నిండా నిద్ర పోలేకపోతున్నారు.

ఎండలు మండుతున్నాయి. హనుమకొండ టీచర్స్‌ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం పైన శ్లాబ్‌వేసి క్యూరింగ్‌ కోసం కట్టలు కట్టి సుమారు అడుగులోతు నీళ్లు నిలపడంతో మంగళవారం రెండు వానరాలు వాటిలో ఈదుతూ, గంతులేశాయి. ఈనాడు కెమెరాకు చిక్కిన చిత్రాలివి.

ఎన్నికల సీజన్‌కు తగ్గట్టు అనకాపల్లిలో ఎలక్ట్రికల్‌ వాహనాలు సిద్ధమవుతున్నాయి. పార్టీల రంగులతో ఈ వాహనాలను రూపొందిస్తున్నారు. నేతల ఫొటోలతో పాటు పార్టీ గుర్తులు వీటిపై అతికిస్తున్నారు. 

విశాఖ జిల్లా సాగర్‌నగర్‌ బీచ్‌ సమీప తీరానికి మంగళవారం విభిన్న ఆకృతుల ఆకర్షణీయ ముళ్ల కప్పలు చేరాయి. శరీరమంతా ముళ్లుండే ఈ కప్పల పైభాగంలో గోధుమ, కింది భాగంలో తెలుపు రంగు ఉంటుంది. దాదాపు పది కిలోల బరువు పెరిగే ఈ జీవులు వలకు చిక్కినా సరే ఏ విధమైన ప్రయోజనం ఉండదు.

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కోతులు, కుక్కల బెడద నగరవాసులను ఇబ్బందుల పాలు చేస్తుంది. మంగళవారం స్థానిక భాగ్యనగర్‌లో ఓ రైతు మార్కెట్‌కు తరలించేందుకు దోసకాయలను పెట్టెల్లో సర్ది వాహనంలో సిద్ధంగా ఉంచారు. అంతలోనే కోతుల గుంపు అక్కడికి చేరుకొని దోసకాయలు అందినకాడికి ఎత్తుకెళ్లాయి.

ప్రయాణికులు వేసవి తాపానికి గురి కాకూడదని ఓ ఆటోడ్రైవర్‌ తన వాహనంపై ఏకంగా నారు పెంచుతూ చల్లగా ఉంచుతున్నారు. హైదరాబాద్‌ నగరంలో తిరుగుతున్న ఈ ఆటో.. పై కప్పున నారుతో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. అల్వాల్‌కు చెందిన ఓం ప్రకాశ్‌ తన ఆటోపై గోనెసంచులు వేసి వరి విత్తనాలు వేశారు. 

వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం గొట్లకొండ శివారులోని దొడ్డితండాలో వ్యవసాయ బావి వద్ద విద్యుత్తు సరఫరాలో సమస్య రావడంతో రైతు ఇస్లావత్‌ శ్రీను స్తంభంపైకి ఎక్కి జంపర్‌ను మార్చుతుండగా విద్యుదాఘాతానికి గురై తలకిందులుగా వేలాడారు.

హీరామండి.. అస్లీ సోనా

మలైకా.. అదిరింది యోగా!

చిత్రం చెప్పే విశేషాలు(26-04-2024/1)

Eenadu.net Home