చిత్రం చెప్పే విశేషాలు

(29-03-2024/1)

రెండు రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. తప్పనిసరి బయటకెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చార్మినార్, నాంపల్లి ప్రాంతాల్లో గురువారం తీసిన చిత్రాలివి. 

ఎన్నికల నగారా మోగడంతో ప్రచార సామగ్రిని పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌ నగరంలోని పలు కార్ఖానాల్లో జెండాలు, ఫ్లెక్సీలు తయారు చేసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ సమీపంలోని మేదరి బస్తీలో జెండాలకు కర్రలు అమర్చుతూ పలువురు ఉపాధి పొందుతున్నారు.

విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. ఈ జీవులను ‘పఫర్‌ ఫిష్‌’ అని పిలుస్తారని, స్థానిక జాలర్లు సముద్ర కప్పలని అంటారు. ఈ జీవులు వలలో చిక్కుకున్నప్పుడు తమను తాము రక్షించుకునేందుకు ఇలా బెలూన్ల తరహాలోకి మారుతుంటాయి.

రాయదుర్గం ఐటీ కారిడార్‌లోని టీ హబ్‌ ఎదురుగా ఖాళీ స్థలంలో ఓ విమానంలో హోటల్‌ పనులు మొదలు పెట్టనున్నారు. ఇలాంటిది శామీర్‌పేటలో ఒకటి సిద్ధమవుతుండగా ఇది రెండోది. చుట్టూ అద్దాలతో భారీ భవనాలుండగా ఇది ప్రారంభమైతే ఈ ప్రాంగణం మరింత ఆకట్టుకోనుంది.

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్‌కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్‌ డ్యామ్‌లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. వాటిలో ఇదే 25 కిలోల బరువు తూగింది.

అనంతగిరి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగు నీటిని అందించేందుకు అటవీ సిబ్బంది సాసర్‌పిట్లు అక్కడక్కడా ఏర్పాటుచేశారు. అందుబాటులో లేని చోట, సమీపంలోని పైప్‌లైన్‌ లీకేజీ నీరు, మడుగులు, చిన్నపాటి కాలువల్లో దొరికే నీటిని తాగి దప్పిక తీర్చుకుంటున్నాయి.

ఓటరుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటివి దూరం పెట్టాలనేది వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నియోజకవర్గ అధికారులు గురువారం ఇలా వైకుంఠపాళి చిత్రంతో అవగాహన కల్పించారు.  

శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన 1938 సంవత్సరానికి చెందిన పాత రోల్స్‌ రాయిస్‌ కారును తిప్పుతున్నారు. తణుకుకు చెందిన గిరి అనే వ్యక్తి ఈ వాహనాన్ని వేలంలో కొనుగోలు చేసి రాజస్థాన్‌ నుంచి రప్పించారు. మచిలీపట్నంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు కలపర్రు టోల్‌గేటు సమీపంలో కనిపించింది.

జనగామ జిల్లా సరిహద్దు నుంచి జనగామ - హనుమకొండ సరిహద్దు వరకు ప్రస్తుతం హైవేకు ఇరువైపులా కిలోమీటరుకు సుమారు 10 వేల చొప్పున మొక్కలు నాటుతున్నారు. పెంబర్తి నుంచి పెండ్యాల వరకు రోడ్డు మధ్యలో నాటిన పూల మొక్కలు రహదారికి పచ్చల తోరణంలా మారింది. 

చిత్రం చెప్పే విశేషాలు (27-04-2024/1)

చేద్దాం రీడిజైన్‌

అప్సర @ఇంద్రపురి

Eenadu.net Home