చిత్రం చెప్పే విశేషాలు

(26-04-2024/1)

ఖమ్మం జిల్లా కొణిజర్ల, ఇతర గ్రామాల్లోని కంప చెట్లకు అల్లుకుని ఉండే తీగలకు వేసవిలో పువ్వులు పూసి ఆహ్లాదపరుస్తున్నాయి. ఈ తీగకు పూసిన పువ్వులను స్థానికులు రాఖీ పూలుగా పిలుస్తారు. ఇవి తెలుపురంగులో ఉండి రాఖీ ఆకారంలో ఉంటాయి.

కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. తెలంగాణలో అత్యధికంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో కోకో సాగవుతోంది. ఆయిల్‌పాం, కొబ్బరి తోటల్లో అంతరపంటగా దీనిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.

పశ్చిమ ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలాలు ఇవి. వీటిని సముద్రంలోకి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వన్యప్రాణుల అధికారులు తెలిపారు. 

నోటుకు ఓటు అమ్ముకోకుండా ప్రతి ఒక్కరు చైతన్యవంతమై తమ హక్కును వినియోగించుకోవాలంటూ.. ఒంగోలు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఇలా సైకత శిల్పం ఏర్పాటు చేశారు. విజయవాడకు చెందిన బాలాజీ వరప్రసాద్‌ దీన్ని తీర్చిదిద్దారు.

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. ఇప్పుడు వారంతా ఇబ్బందులు పడుతున్నారు.


తిరుమల శ్రీవారిని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వేదపండితులు ఉపరాష్ట్రపతికి వేదాశీర్వచనం పలికి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు.  

విశాఖ జిల్లా చింతూరు మండలం లోయరు సీలేరు ప్రాజెక్టులో బుధ, గురు వారాల్లో పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదైంది. సూర్యుడి ప్రతాపానికి జనం బయటకు రాలేక అల్లాడిపోయారు. వేసవి తాపాన్ని భరించలేక ప్రజలు స్థానిక కొలనులో సేదదీరారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. ఈ గాలులకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై దుమ్ము విపరీతంగా పైకి లేచింది. 

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. ఈ సందర్భంగా చుట్టుపక్కల మండలాల నుంచి తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు ర్యాలీలకు తరలివచ్చారు. దీంతో పట్టణాలు కిక్కిరిసిపోయాయి.

జాన్వీ కొత్త సినిమా మొదలైంది.. చూశారా!

చిత్రం చెప్పే విశేషాలు (06-05-2024/1)

ముంబయి ఫ్యాషన్‌ వీక్‌లో మృణాల్‌ హొయలు

Eenadu.net Home