చిత్రం చెప్పే విశేషాలు

(22-05-2024/1)

ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు కరీంనగర్‌ మానేరు జలాశయం. సూర్యకిరణాలు జలాశయంపై పడినప్పుడు.. ఇలా వెండి పరిచినట్లు చూపరులకు కనువిందు చేసింది. వెండి వెలుగులో మత్స్యకారులు చేపలు పట్టడం.. మానేరంతా వెండి కప్పి వేసిందా? అనే దృశ్యాలు అందరిని కట్టిపడేశాయి.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు రేవంత్‌ రెడ్డి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు స్వామివారికి చెల్లించారు. అనంతరం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెట్రో ట్రక్ పార్కింగ్‌ వద్ద ‘అండర్‌ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్’ ఎగ్జిబిషన్ నిర్వహించారు. స్కూబా డైవింగ్‌తో పాటు స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జలకన్యలు ఈ ఎగ్జిబిషన్‌లో మెరిశారు.

ఇటీవల మూడు రోజుల పాటు వరుసగా కురిసిన వర్షాలతో హైదరాబాద్‌ నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అడపాదడపా కాస్త విరామం ఇవ్వడంతో వానకు తడిచిన పాత పుస్తకాలను రాజేంద్రనగర్‌ పరిధిలోని అత్తాపూర్‌లో ఓ చిరు వ్యాపారి ఇలా రహదారిపై ఆరబెట్టారు.

ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరు గ్రామంలో కోతులను పారదోలేందుకు ఓ వ్యక్తి కొండముచ్చును కాపలాగా పెట్టారు. ఇంటి వద్ద నిలిపిన ట్రాక్టర్‌కు దాన్ని కట్టేయగా సీట్లో కూర్చుని స్టీరింగ్‌ను పట్టుకుంది. వానరాల పనిపడతా.. వాహనం నడిపేస్తా అన్నట్లున్న దీన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.

ఆకాశంలో నీలి మేఘాలు కమ్ముకున్న వేళ... చల్లటి గాలులు తనువును మీటుతున్న సమయాన... గోదావరి ఒడ్డు కనువిందు చేసింది. తూర్పుగోదావరి జిల్లా కుక్కునూరు మండలం వింజరం ఓడరేవు వద్ద కనువిందు చేసిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

వరంగల్‌ జిల్లా పద్మాక్షి కాలనీలోని శ్రీ హనుమద్గిరి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ దేశాల కరెన్సీ నోట్లతో మాలలు తయారు చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.

మత్తడివాగు ఆదిలాబాద్‌ నుంచి మహారాష్ట్ర ప్రధాన రహదారికి ఆనుకొని ఉండటంతో చూపరులను ఆకట్టుకుంటూ నిండుకుండను తలపిస్తుండేది. ప్రస్తుతం జలాశయంలో నీరు లేక అడుగంటిపోయింది. 2008లో నిర్మించిన ఈ ప్రాజెక్టును ఎప్పుడూ ఇలా చూడలేదంటున్నారు రైతులు.

వచ్చే జూన్‌ 2కు తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తదితరులు భేటీ అయ్యారు.

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట-బుట్టాయిగూడెం మండలాల సరిహద్దులోని గుబ్బలమంగమ్మ తల్లి అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతానికి కొంచెం దూరంలోని కొండపైన చక్కని జలపాతం ఉంది. ఇది నడివేసవిలో భక్తులకు ఎనలేని సాంత్వనను అందిస్తోంది.

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home