చిత్రం చెప్పే విశేషాలు

(24-05-2024/1)

వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మహ్మద్‌హుస్సేన్‌పల్లి ఊర చెరువులో గురువారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. మూడు అడుగుల పొడవు, 20 కిలోల బరువు ఉందని మత్స్యకారుడు శివ తెలిపారు. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం వద్ద కృష్ణాతీరంలో సహజ సిద్ధంగా పెరిగిన మొక్కలు ఇలా అందంగా విరబూశాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లో పెరిగే ఈ ఔషధ మొక్క శాస్త్రీయ నామం ‘క్లియోమ్‌ చెల్లిడోని’ అని, తెలుగులో అడవి ఆవాల మొక్కగా పిలుస్తారు.

పువ్వుల్లోని మకరందాన్ని జుర్రుకోవాల్సిన తేనెటీగలు మంచినీటి కోసం అల్లాడిపోయాయి. ఏలూరు శాంతినగర్‌ లోని నీటిశుద్ధికేంద్రం ఆవరణలోని కొళాయి చెంత ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన చిత్రాలివి.

కేరళలో ఇటీవల జరిగిన మిస్‌ఇండియా ప్రీ-టీన్‌ పోటీల్లో విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన గర్భాం ప్రీతి పట్నాయక్‌ విజేతగా నిలిచారు. టాలెంట్, డ్రెస్సింగ్, నృత్యం విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచారు.

విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జెర్బరా పూలు ఆకట్టుకుంటున్నాయి.శాస్త్రవేత్తలు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా రెండేళ్లుగా గ్లాడియోలస్, లిల్లియం, చైనాఆస్టర్, జెర్బరా, బంతి, తులిప్‌ వంటి వివిధ రకాల పూలు సాగు చేస్తున్నారు.

హైదరాబాద్‌ మూసాపేట భరత్‌నగర్‌ పైవంతెన మధ్యలో ఓ వాటర్‌ ట్యాంకర్‌ టైరు పేలడంతో వాహనం అక్కడే ఆగిపోయింది. దీంతో వంతెన మధ్య నుంచి వైజంక్షన్‌ వరకు ట్రాఫిక్‌ భారీగా నిలిచింది.

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో కొండ కనకయ్య అనే వ్యాపారి తన ఇంటి ముందు మూగజీవాల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం విపరీతమైన ఎండతో విలవిలలాడిన ఓ శునకం తొట్టెలో నీటిని గమనించి ఇలా కూర్చొని ఉపశమనం పొందింది.

హైదరాబాద్‌ నగరంలో తాగునీటి కష్టాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మాదాపూర్‌ ఖానామెట్‌ వద్ద మిట్ట మధ్యాహ్నం గొడుగులు వేసుకుని మరీ సన్నటి ధారతో వస్తున్న మంచినీటిని మోటార్ల సాయంతో లాగుతూ పైపులు ద్వారా పట్టుకుంటున్న స్థానికులు ఇలా కనిపించారు. 

వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున మంచు కమ్మేసింది. దీంతో రహదారులు, సమీప భవనాలు కూడా కనిపించలేదు. సూర్యుడు ఉన్నా మంచు ముసుగు తొలగలేదు.

చిత్రం చెప్పే విశేషాలు(27-07-2024)

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

Eenadu.net Home