చిత్రం చెప్పే విశేషాలు

(20-06-2024)

ఆంధ్రప్రదేశ్‌ పర్యటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కందుల దుర్గేశ్‌కు అగ్ర కథానాయకుడు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వంభర’ సెట్స్‌కు ఆయన వచ్చిన సందర్భంగా (దిగిన) ఫొటోలను ఎక్స్‌ వేదికగా చిరు పంచుకున్నారు.

ఉత్తర భారత దేశంతోపాటు ఈశాన్యం అగ్ని గుండాలుగా మారాయి. దిల్లీ, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఉత్తర్‌ ప్రదేశ్, ఉత్తర రాజస్థాన్‌లో తీవ్ర ఉక్కపోతతోపాటు నీటి కొరత ప్రజలను అల్లాడిస్తోంది. దిల్లీలోని చాణక్యపురిలో తాగునీటికోసం స్థానికులు ట్యాంకర్‌ను ఇలా చుట్టుముట్టారు.

వైయస్సార్‌ జిల్లా వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట జలకళ సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పెన్నాలో కలుస్తుండటంతో ఆనకట్ట వద్ద పుష్కలంగా నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆనకట్ట వద్ద పర్యాటకుల సందడి నెలకొంటోంది. 

అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో రైతు సర్దానప్ప రెండెకరాల్లో టమాట సాగు చేశారు. పంటలో కలుపు మొక్కలు తొలగించడానికి డబ్బులేక.. ఎద్దులకు బాడుగ పెట్టలేక తన కుమారుడితోపాటు తమ్ముని కుమారుడి సాయంతో గుంటక లాగించి కలుపు మొక్కలు తొలగించారు. 

 గొడుగు మాదిరి కనిపిస్తున్న టోపీలను ముంబయిలో కొనుగోలు చేసి ఖమ్మంలో ఒక్కొక్కటి రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో, వర్షం కురుస్తున్నప్పుడు వీటిని ధరించటానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తారని ‘ఈనాడు’కు దిలీప్‌కుమార్‌ తెలిపారు.

టమాటాను పోలి ఉన్న ఈ పండ్లు వెస్టిండియన్‌ చెర్రీస్‌. వీటిని బార్బడోస్‌ చెర్రీస్‌ అని కూడా అంటారు. విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా కేంద్రం ఆవరణలో ఇవి ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఆదిలాబాద్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని కుంటాల, పొచ్చర జలపాతాలు జలకళ సంతరించుకున్నాయి. ఆ నీటితో పాటు చిన్నా, పెద్ద చేపలు సైతం కొట్టుకుని వస్తున్నాయి. చేపలను చూసి పర్యాటకులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం కల్లుదేవనహళ్లి హగరిలో చేతిపంపు అందనంత ఎత్తులో ఉంది. దీని చుట్టూ గతంలో ఇసుకను తోడేయడంతో పెద్ద గుంతలు పడ్డాయి. ఈక్రమంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు వేదవతి హగరి పొంగి ప్రవహించడంతో ఇసుక కొట్టుకుపోయింది. 

గుంటూరు జిల్లా తెనాలి టౌన్‌ పట్టణంలోని కవిరాజా పార్కు ఆవరణలో జలకాలాటలతో సందడి చేస్తున్న చిన్నారులను చూసి ఇక్కడేదో కొత్తగా ఈత కొలను నిర్మించారనుకుంటే పొరపాటే. ఇటీవల కురిసిన వర్షపు నీరు బయటకు పోయే మార్గం లేక ఉద్యానం ఆవరణ చెరువుగా మారింది.

ఈ ఫొటోలో కనిపిస్తున్న నాణెం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ శివారులోని పాటిగడ్డ మీద లభ్యమైంది. ఇక్ష్వాకుల కాలంలో ముద్రించిన ఈ నాణెంపై గుర్రం గుర్తుతోపాటు అర్ధవృత్తాకారంలో శివసేబకస అనే గుర్తు బ్రహ్మలిపిలో ఉందని చరిత్రకారుడు రత్నాకర్‌రెడ్డి తెలిపారు.

తమిళనాడు రాష్ట్రం చెన్నైలో రెండు రోజులుగా రాత్రి సమయంలో వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఆకాశం మేఘావృతమై కనిపించింది.

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home