చిత్రం చెప్పే విశేషాలు

(01-07-2024)

హైదరాబాద్‌ నగరంలో మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖైరతాబాద్‌లో జోరువాన కురుస్తున్నా మెట్రో రైలు ఇలా ముందుకు సాగింది. 

చుట్టూ నీరు.. మధ్యలో భూభాగం ఉంటే ద్వీపం అనడం సహజం. ఇలాంటి దృశ్యాలు నదులు, సముద్రాలు, సరస్సుల్లో కనిపిస్తుంటాయి. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు జలమట్టం తగ్గిపోవడంతో నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని నల్లమల అడవులను ఆవరించి ఉన్న కృష్ణా వెనుక జలాల్లో ఇలా ఓ ద్వీపం తేలింది.

తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున పొగమంచుతో తర్వాత తేలికపాటి జల్లులతో, సాయంత్రం మళ్లీ పొగమంచుతో కనువిందు చేసింది. దీంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం పొంగిపొర్లుతోంది. కురుస్తున్న వర్షాలకు జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కొండను మంచు కమ్ముకొని ఇలా హిమగిరిలా కనిపించింది. ఆ ప్రకృతి రమణీయత జాతీయ రహదారి వెంట వెళుతున్న వారికి కనువిందు చేసింది.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లా వేమనపల్లి సమీపంలోని ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం కొంతమేరకు పెరిగింది. వేసవిలో ఎండిపోయినట్లుగా కనిపించిన నదికి ఈ వర్షాకాలంలో తొలిసారి జలకళ కనిపించింది.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రంగధాముడి చెరువు సమీపంలోని ఖాళీ స్థలంలో చిన్నా పెద్దా ఎవరికి వారే జట్లుగా విడిపోయి.. వికెట్ల స్థానంలో రాళ్లు పాతుకొని క్రికెట్‌ ఆడుతూ సందడి చేశారు.

తమిళనాడు రాష్ట్రం పుదుచ్చేరిలో ‘టెంపుల్‌ అడ్వెంచర్‌’ పేరుతో స్కూబా డైవింగ్‌ శిక్షణ ఇస్తున్న అరవింద్‌ తరుణ్‌శ్రీ క్రికెట్‌ టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో సముద్రంలో 50 అడుగుల లోతులో జాతీయ జెండా, ప్రపంచకప్‌ నమూనా ప్రదర్శించారు.

విశాఖ జిల్లా తారాబు జలపాతంలో వరద ఉద్ధృతి పెరిగింది. నిత్యం పాల నురగలా పారే జలపాతం ప్రస్తుతం వర్షపు నీటితో ఎరుపెక్కింది. జలపాతం అందాలు ఆస్వాదించేందుకు పర్యటకులు తరలివస్తున్నారు.

జగిత్యాలకు వెళుతున్న మాజీ మంత్రి కేటీఆర్‌కు కరీంనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నగర భారాస అధ్యక్షుడు రవిశంకర్, కార్పొరేటర్లు తదితరులు స్వాగతం పలికారు.

విశాఖ జిల్లా తాండవ నదిలో జలకళ ఉట్టిపడుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాండవలోకి నీరు చేరుతోంది. దీంతో భూమి, ముఠా ఆనకట్టల వద్ద జలాలు కనువిందు చేస్తున్నాయి.

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home