చిత్రం చెప్పే విశేషాలు..!
(10-08-2022/1)
శాంతిపురం మండలం పెద్దూరు వద్ద తోటల్లోనే వదిలేసిన బంతిపూలు ఇవి. కుప్పం సహా పలు నియోజకవర్గాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన బంతిపూలు తోటల్లోనే మగ్గిపోతున్నాయి. వీటికి ధర లేనందున కొనుగోలుదారులు ముందుకు రాని దుస్థితి.
Source: Eenadu
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నగరంలో స్కేటింగ్ క్రీడాకారులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. డీఎస్ఏ స్టేడియం నుంచి కొండారెడ్డి బురుజు వరకు చిన్నారులు మంగళవారం స్కేటింగ్ చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు.
Source: Eenadu
అవనిగడ్డ నుంచి కోడూరు వెళ్లే ప్రధాన రహదారి ఇది. భారీ గోతులతో అధ్వానంగా మారినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఈ మార్గంలో ప్రయాణించేవారికి వెనకాలే 108 రావాల్సిందేనని వాహన చోదకులు చెబుతుండగా వెనుకనే 108 వాహనం వస్తూ కనిపించిన చిత్రమిది.
Source: Eenadu
వర్షాలకు శంషాబాద్ సమీపంలోని నానాజీపూర్ చెరువు అలుగు పారుతుండడంతో చిన్నాపెద్దా తేడాలేకుండా ఇక్కడికి వస్తున్నారు. పలువురు యువకులు జాగ్రత్తలు తీసుకోకుండా నీటిలోకి దిగుతున్నారు. ఏటా జలపాతాలవద్ద పలువురు యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
Source: Eenadu
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో మొహర్రం ఊరేగింపులో దేశభక్తి వెల్లివిరిసింది. మువ్వన్నెల జెండాను పోలి ఉండేలా మూడు రంగులతో అలంకరించిన పీరీతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
Source: Eenadu
చొప్పదండి మండలంలోని పెద్ద కుర్మపల్లికి చెందిన మావురం మల్లికార్జున్రెడ్డి దేశభక్తిని చాటాలనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టు 15న తన వరిపొలంలో భారతదేశ చిత్రపటాన్ని వరినాట్లతో ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు పొలంలో నిత్యం జనగణమన పాడి, జెండా ఆవిష్కరణ చేస్తున్నారు.
Source: Eenadu
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అడ్డాకుల మండలంలోని పెద్దవాగును దాటేందుకు వర్నె వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన తెగిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా ప్రమాదకరంగా వాగును దాటారు.
Source: Eenadu
నిజామాబాద్లోని వినాయక్నగర్లో ఓ వ్యక్తి భిక్షాటన కోసం గంగిరెద్దు స్థానంలో కుక్కను వెంటతీసుకొచ్చాడు. ఇదేంటని ప్రశ్నించగా గంగిరెద్దులు దొరకడం లేదని, తోడుంటుందని కుక్కను వెంట తెచ్చుకున్నట్లు పేర్కొన్నారు.
Source: Eenadu