చిత్రం చెప్పే విశేషాలు! (11-08-2022/1)
ఎగువన కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.రెండు జలాశయాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలివి.
image:Eenadu
హైదరాబాద్ ఐటీ కారిడార్లో నాలెడ్జి సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో నిర్మిస్తున్న భారీ భవనాలకు పునాదుల అనంతరం.. ఇనుప స్తంభాలనే పిల్లర్లుగా మార్చి, వాటికి అద్దాలు అమర్చి చకచకా నిర్మాణాలు కానిచ్చేయడంతో ఏళ్ల తరబడి సాగే భారీ నిర్మాణాలూ ఏడాదిలోనే పూర్తయిపోతున్నాయి.
image:Eenadu
ఈ ఏడాది టమాటా సాగుతో అనంతపురం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ధరలు లేకపోవడం, నాణ్యత లేదంటూ వ్యాపారులు తిరస్కరించడంతో రైతులు ఎక్కువ శాతం పారబోశారు. జిల్లాలోని కక్కలపల్లి మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఎటూ చూసినా కుప్పలు కుప్పలుగా పడేసిన టమాటానే కనిపిస్తోంది.
image:Eenadu
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో బుధవారం జాతీయ పతాక శోభాయాత్ర వైభవంగా సాగింది. కలెక్టర్ శివశంకర్, జేసీ శ్యాంప్రసాద్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి యాత్రను ప్రారంభించారు. image:Eenadu
ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్ పంచాయతీ పరిధిలోని రాంలింగంపేట్కు ఉన్న ఏకైక రహదారి బురదమయమై అధ్వానంగా తయారై అంబులెన్స్ రాలేని పరిస్థితి. దీంతో చేసేదేమి లేక ఇలా తన ద్విచక్ర వాహనంపై భార్య పిల్లలను ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లాడు సోము.
image:Eenadu
పాల్వంచ అంబేడ్కర్ కూడలి నుంచి ఆంజనేయస్వామి గుడికి వెళ్లే రహదారి ప్రారంభంలో తాగునీటి ప్రధాన పైపులైన్కు నెలన్నర క్రితం లీకేజీ ఏర్పడి గుంతలో నీరు నిలిచింది. బుధవారం ఓ వాహనదారుడు సాధారణ గుంత అనుకుని వాహనాన్ని నడపడంతో ఇలా ఇరుక్కుపోయింది.
image:Eenadu
కూసుమంచి మండలంలోని గట్టుసింగారం పరిధి గన్యాతండాలో రైతు భూక్యా వీరభద్రరావు డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేశారు. పంట చేతికి వచ్చినా మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతే వాహనంలో ఖమ్మం తీసుకొచ్చి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
image:Eenadu
ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని కాకినాడ ఐటీఐ విద్యార్థులు మహాత్ముని ప్రతిమను వినూత్నంగా తయారు చేశారు. వెల్డింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు ఇనుప చువ్వలతో ఆకట్టుకునే విధంగా మహాత్ముని రూపాన్ని రూపొందించారు. image:Eenadu