చిత్రం చెప్పే విశేషాలు.. (26-09-2023/1)
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటేన్ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరుకావాల్సి ఉండగా.. ఆయన రాకపోవడంతో మేయర్ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఆరంభించారు.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని విశ్వేశ్వరాయపురంలో ఏర్పాటు చేసిన గణపతికి కరెన్సీతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు సమకూర్చిన రూ. 9 లక్షల విలువ నోట్లతో మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇందుకు ₹20, ₹50, ₹100, ₹200, ₹500 నోట్లను వినియోగించారు.
మైసూరు దసరా సంబరాల్లో పాల్గొనే గజరాజుల రెండో బృందం సోమవారం రాచనగరికి చేరుకుంది. ప్యాలెస్ ముంగిట వాటికి సంప్రదాయ స్వాగతం లభించింది. బండీపుర, నాగరహొళె అభయారణ్యాల నుంచి ఈ ఏనుగులను రాచనగరికి ప్రత్యేక వాహనాల్లో రప్పించారు.
ఖమ్మంలోని ఇల్లెందు మండలం మసివాగు గ్రామానికి చెందిన కొడెం కృష్ణ వాహన టైర్ల మెకానిక్. అప్పుడప్పుడు సరదాగా చేసిన సాధనతో ట్యూబ్లను ట్రాక్టర్కు సోమవారం కట్టి 20 మీటర్ల వరకు వాహనాన్ని లాగి అబ్బురపరిచాడు.
రోజురోజుకు డెంగీ కేసులు పెరిగిపోతుండడాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో సోమవారం దోమతెరలతో ఆందోళన నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు.
హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి వద్ద సోమవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వివిధ వాయిద్యాలతో నిర్వహించిన బ్యాండ్ అలరించింది.
ఒకే కాండంపై రెండు చెట్లు కనిపించటం వింతగానే ఉంటుంది. మహబూబ్నగర్ పట్టణంలోని ఏనుగొండ బైపాస్ సమీపంలోని ఈ చెట్లను ‘న్యూస్టుడే’ కెమెరాలో బంధించింది.
విశాఖపట్నంలో వంజంగి సమీపంలోని మేఘాలకొండ మంచు అందాలు సందర్శకులను మైమరిపిస్తున్నాయి. సోమవారం ఉదయం కొండపై మంచు దుప్పటి పరచుకుంది. మైదాన ప్రాంతాల నుంచి పర్యాటకులు ఆదివారం రాత్రికే కొండపైకి చేరుకుని వేకువజామున మంచు అందాలను ఆస్వాదించారు.