శిఖ అసలైన నాయిక..
శిఖా మల్హోత్రా.. ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న నటే అయినా.. ఈమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
(Photos: Instagram/Shikha Malhotra)
హీరోయిన్గా ఎదగాలన్న ఆశయంతో ముందుకెళ్తోన్న శిఖ.. కరోనా కాలంలో సమాజానికి తనవంతు సాయం చేసి తనే ప్రమాదంలో పడింది.
కొవిడ్ సోకి.. చావు అంచులదాక వెళ్లింది.. నెలలపాటు మందులు వాడడం, మంచానికే పరిమితం కావడంతో ఊబకాయురాలిగా మారిపోయింది. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని తిరిగి గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది.
దిల్లీకి చెందిన శిఖ.. నర్సింగ్లో డిగ్రీ చేసింది. నటనపై ఆసక్తితో ముంబయికి వచ్చేసింది. షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’తోపాటు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది.
‘కాంచ్లీ’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం రావడంతో తనేంటో నిరూపించుకోవాలని బాగా నటించింది. అదే సమయంలో కరోనా మహమ్మారి ప్రపంచంపై పడింది.
కొవిడ్ సోకి ప్రజలు ఆస్పత్రులపాలవుతుండంతో చలించిపోయిన శిఖ.. నర్సింగ్ డిగ్రీ ఉండటంతో ముంబయిలోని బీఎంసీ ఆస్పత్రిలో కొన్ని నెలల పాటు నర్స్గా పనిచేసింది. ఇందుకు తను వేతనం కూడా తీసుకోలేదు.
కొన్ని రోజులు కొవిడ్ ఐసీయూలో.. కొన్ని రోజులు కొవిడ్ బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తూ సేవలందించింది. ఈ క్రమంలో తానూ ఈ వైరస్ బారిన పడింది.
కొవిడ్ తీవ్ర ప్రభావం చూపడంతో పాక్షిక పక్షవాతానికి గురైంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పరిస్థితి మరింత దిగజారింది. కొన్ని నెలలపాటు మందులు, స్టిరాయిడ్స్ వాడటంతో విపరీతంగా బరువు పెరిగింది.
ఎలాగో అలా మహమ్మారి బారి నుంచి బయటపడ్డ శిఖ తన జీవితాన్ని మళ్లీ గాడిలో పెట్టాలనుకుంది. ఈ క్రమంలోనే వ్యాయామాలు చేస్తూ, కఠినమైన డైట్ ఫాలో అవుతూ తిరిగి తన నాజూకు శరీరాన్ని పొంది.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.
దృఢసంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని శిఖ నిరూపించింది. తాజాగా ఈమె స్పూర్తిమంతమైన గాథ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు శిఖపై ప్రశంసలు కురిపిస్తున్నారు.